ఫ్లై ఓవర్ ప్రమాదం‌: కుబ్రా బేగంకు వెంకట్రామిరెడ్డి చేయూత

25 Nov, 2019 18:20 IST|Sakshi

సాక్షి, అనంతపురం : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మంచి మనసును చాటుకున్నారు. హైదరాబాద్‌లోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23)కు చేయూత అందించారు. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ కింద బాధిత యువతికి హైదరాబాద్‌లో మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. అలాగే బాధితురాలికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ విడుదలయ్యేలా అధికారులతో సంప్రదింపులు జరిపారు. అనంత వెంకట్రామిరెడ్డి వినతి మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీఎం సహాయకనిధి నుంచి రూ.3,60,000 మంజూరు చేసింది.

(చదవండి : బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం)

అనంతపురంనకు చెందిన కుబ్రా బేగం శనివారం హైదరబాద్‌లోని ఓ కంపెనీకి ఇంటర్వ్యూకు హాజరై సెలక్ట్‌ కూడా అయింది.  ఈ వార్తను సెల్‌ఫోన్‌లో అనంతపురంలో ఉన్న  తండ్రి తో పంచుకుంటున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఒంటినిండా గాయాలతో చావుబతుకులతో పోరాడుతోంది. గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదంలో కుబ్రా వెన్నెముక దెబ్బతిందని, ఆపరేషన్‌ కోసం రూ.6లక్షలు ఖర్చు అవుందని వైద్యులు చెప్పారు. 

(చదవండి : రూపాయి లేదు..వైద్యమెలా!)

తప్పకుండా ఆదుకుంటా: కేటీఆర్‌
ఫ్లైఓవర్‌ ప్రమాదంలో గాయపడిన కుబ్రా బేగం (23) ను తప్పకుండా ఆదుకుంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘రూపాయి లేదు..వైద్యమెలా!’  అనే శీర్షికతో సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ఓ నెటిజన్‌ కేటీఆర్‌కు ట్విట్‌ చేశారు. ఎలాగైనా ఆ యువతిని ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌.. ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఆరోగ్యంపై మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో చర్చించానని చెప్పారు. కుబ్రా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

>
మరిన్ని వార్తలు