పద్మావతి వర్సిటీలో బయోమెట్రిక్ విధానం

21 Aug, 2015 09:37 IST|Sakshi

యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానాన్ని వీసీ రత్నకుమారి గురువారం ప్రారంభించారు. ర్యాగింగ్ కారణంగా నాగార్జున విశ్వవిద్యాలయంలో రుషితేశ్వరి ఆత్మహత్యతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు మహిళా వర్సిటీ అధికారులు ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేయడమేగాక విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఐడెంటిటీ కార్డులు మంజూరు చేశారు.

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు వసతి గృహంలోకి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు వేలిముద్రల ద్వారా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. సర్వర్ రిమోట్ ద్వారా దీన్ని అనుసంధానం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మి, వార్డెన్ పి.వాణి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు