ప్రజలకు గవర్నర్ విశ్వభూషణ్ పిలుపు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తిగా సహకరించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కోరారు. ఈ మహమ్మారి విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గవర్నర్ విశ్వభూషణ్ సోమవారం దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలను ఆదుకునేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికే రెడ్క్రాస్ సంస్థ పేదలు, వలస కూలీలకు ఆహారం, మంచినీళ్ల ప్యాకెట్లు సరఫరా చేస్తోందన్నారు. పేదలకు ఉచితంగా రేషన్తోపాటు ప్రతి ఇంటికి రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గవర్నర్ చెప్పారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రెడ్క్రాస్, ఎన్జీవోలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు.