‘కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట.. సామాజిక దూరమే’

4 Apr, 2020 15:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: మానవాళి మనుగడ కోసం చేపడుతున్న లాక్‌డౌన్ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు తనదిగా భావించినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్ పేర్కొన్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్‌ ప్రకటన వెల్లడించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సామాజిక దూరమే కీలకం కావునా ప్రతి ఒక్కరూ తదనుగుణంగా వ్యవహరించడమే కాకుండా... మరికొందరికి సామాజిక దూరం ఆవశ్యకతను సామాజిక మాధ్యమాల ద్వారా వివరించాలని ఆయన ప్రకటనలో సూచించారు. చివరి రోజు వరకు ఎటువంటి వెసులు బాటు లేకుండా దీనిని పూర్తి చేయాలన్నారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో మత పరమైన సదస్సులు, సమావేశాలు మంచిది కాదని, ఆ మేరకు మత పెద్దలు ప్రజలకు తగిన సూచనలు చేయాలని హరిచందన్ పిలుపు నిచ్చారు. సాధారణంగా మత పరమైన కార్యక్రమాల వల్ల సమూహాలు ఏర్పడతాయని తాజా పరిస్ధితులలో ఇది ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదన్నారు. (కరోనా కట్టడికి పటిష్ట చర్యలు)

అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను తూచా తప్పకుండా పాటించటమే దేశ పౌరులుగా సమాజానికి చేయగలిగన సేవ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తిని నివారించే క్రమంలో వైద్య సేవలో నిమగ్నమై ఉన్న సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కొన్ని ప్రాంతాలలో వైద్య ఆరోగ్య సిబ్బంది విధులను అడ్డుకోవటం వంటివి చేస్తున్నారన్న సమాచారం ఆందోళణ కలిగిస్తుందన్నారు. ఈ తరహా పరిస్ధితులు ఏమాత్రం వాంఛనీయం కాదని ఆయన స్పష్టం చేసారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు తీసుకుంఉటన్న చర్యలను ప్రోత్సహించేలా సమాజం వ్యవహరించాలని గవర్నర్ అన్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కృతనిశ్చయం, సంయమనం ప్రాతిపదికన కరోనా వైరస్కు చరమగీతం పాడాలన్న ప్రధాని పిలుపు లభిస్తున్న స్పందన అపూర్వమైందన్నారు. కరోనా అతి వేగంగా విస్తరిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తుండగా, లాక్‌డౌన్‌ కాలపరిమితి ముగిసే వరకు ఎవరూ బయటకు రాకండా ఇంటి వద్దే ఉండాలని సూచించారు. 

చదవండి: కరోనా కట్టడికి ప్రభుత్వాలకు సహకరించండి

ఇక అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా వ్యాప్తి గొలుసును అధికమించగలమని ఆయన అన్నారు. స్వచ్ఛంధ సంస్ధలతో పాటు రెడ్ క్రాస్, ఎన్ సిసి, స్కౌట్స్, గైడ్స్, ఎన్ఎస్ఎస్ వంటి వ్యవస్ధలు కీలక బాధ్యతలు నిర్వర్తించటం ముదావహమన్నారు. ఆయా సీజన్ల మేరకు జరగాల్సిన వ్యవసాయపనులను వాయిదా వేయలేమని, ఈ పరిస్ధితిలో వారికి ప్రభుత్వం అందించిన మినహాయింపును అత్యంత జాగ్రతగా వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ పనులలో సైతం భౌతిక దూరం అవసరమని, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని గవర్నర్ అన్నారు.  
చదవండి: అప్రమత్తంగా ఉండండి.. ఆందోళన వద్దు

మరిన్ని వార్తలు