బీటెక్ దొంగ!

29 Oct, 2014 02:48 IST|Sakshi
బీటెక్ దొంగ!

 7 మోటార్ సైకిళ్లు స్వాధీనం : నిందితుడి అరెస్ట్

 కొలిమిగుండ్ల:  తనో బీటెక్ చదివిన యువకుడు. జల్సాలకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు మోటార్ సైకిళ్ల దొంగ అవతారమెత్తాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి ఏడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ నీలకంఠేశ్వర్ విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు..  కనకాద్రిపల్లెకు చెందిన వెంకటశివ ప్రతాప్‌రెడ్డి  బీటెక్ చదివాడు. అతను ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీవనోపాధి కోసం అనంతపురం జిల్లా తాడిపత్రిలో సెల్‌పాయింట్ నిర్వహించేవాడు. జల్సాలకు అలవాటు పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.

దీంతో బైక్‌ల దొంగ అవతారం ఎత్తాడు. కొలిమిగుండ్లకు చెందిన మరో దొంగ ఉదయ్‌కుమార్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత నంద్యాల, తాడిపత్రి, ప్రొద్దుటూరుతో పాటు కొలిమిగుండ్లలో మొత్తం ఏడు బైక్‌లు చోరీ చేశారు. ఇటీవలనే ఉదయ్‌కుమార్ కొలిమిగుండ్లలో బైక్ చోరీ చేసి బుగ్గలో తిరుగుతుండగా తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేసి  రిమాండ్‌కు తరలించారు.

ప్రతాప్‌రెడ్డి  కోసం పోలీసుల బృందంగా గాలించింది. మంగళవారం అంకిరెడ్డిపల్లె సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బనగానపల్లె మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు. ఏఎస్‌ఐ సలాంఖాన్, హెడ్‌కానిస్టేబుల్ పురుషోత్తంరావు, కానిస్టేబుళ్లు అలీఖాన్,  మహేష్‌నాయక్, హోంగార్డు వెంకటేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు