‘ఎస్పీని వెంటనే సస్పెండ్‌ చేయాలి’

12 May, 2018 14:36 IST|Sakshi
డీజీపీ మాలకొండయ్య

సాక్షి, విజయవాడ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై రాళ్ల దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర బీజేపీ నేతలు కోరారు. శనివారం డీజీపీకి కలిసిన నేతలు..తిరుపతిలో పరిస్థితులను అదుపుచేయని ఎస్పీని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తలపై టీడీపీ భౌతిక దాడులు చేస్తోందని ఆరోపించారు. తమ కార్యకర్తలను రక్షించండి అని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. మీడియాకు చెప్పి మరీ టీడీపీ సభ్యులు అమిత్‌ షాపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మోదీ దిష్టిబొమ్మలు దగ్థం చేసినా కేసులు పెట్టడంలేదని వాపోయారు.

తిరుపతి ఘటనపై డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ.. అమిత్‌ షా మీద రాళ్ల దాడి జరిగిందని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారన్నారు. కానీ అక్కడ రాళ్ల దాడి జరుగలేదని, కాన్వాయ్‌లో ఏడో వాహనం స్లోగా ఉన్నప్పుడు కర్రలతో మాత్రమే దాడి చేశారని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు పెట్టామని, ఒకరిని అరెస్ట్‌ కూడా చేశామని డీజీపీ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, సిబ్బంది తప్పుంటే చర్యలు తీసుకుంటామని డీజీపీ మాలకొండయ్య పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు