‘టీటీడీ అక్రమాలపై విచారణ జరిపించాలి’

22 Jan, 2019 12:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్ర - తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. టీటీడీలో అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు. వీటి వెనక రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు. గత నెల టీటీడీలో టికెట్ల కుంభకోణం వెలుగు చూసినప్పటికి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌ను ఆదేశించాల్సిందిగా గవర్నర్‌ను కోరామని మంత్రి దత్తాత్రేయ తెలిపారు. ఈవోకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాల వల్ల భక్తులకు తిరుమల దేవస్థానం పట్ల నమ్మకం సన్నగిల్లుతుందనిదత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో తిరుమలలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై తాను చర్యలు తీసుకున్నట్లు మాజీ డీజీపీ దినేష్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వెలుగు చూసిన టికెట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు