కేంద్రం చేసిన పనుల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం

28 May, 2020 17:25 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వణికిస్తోందని, దాన్ని అరికట్టడానికి లాక్‌డౌన్‌ విధించి ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపట్టారని బీజేపీ జాతీయ  కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని వర్గాలకు ఆదుకునేలా ప్యాకేజీ ప్రకటించారని పేర్కొన్నారు. 80 కోట్ల మంది పేదలకు ప్రతి నెల రేషన్‌ బియ్యం  అందించారని తెలిపారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఊరట కల్పించారని చెప్పారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని తెలిపారు. ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ‘ఆత్మ నిర్భర భారత్’  కింద ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారని గుర్తు చేశారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే మరో వైపు పార్టీ కార్యకర్తలు కూడా ముందుండి ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు.

ఇప్పుడు మారిన పరిస్థితుల్లో వైరస్‌తో పోరాడుతున్న వారికి పీపీఈ కిట్లు అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అవసరం ఉన్న చోట్ల పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు అందిస్తున్నామని చెప్పారు. 5 వేల కిట్లను కేంద్రం నుంచి రాష్ట్ర పార్టీకి అందిస్తున్నామని అన్నారు. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవవుతున్న సందర్భంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కరోనా విధుల్లో నేరుగా పాల్గొనే‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లను పార్టీ తరపున అందచేస్తున్నామని చెప్పారు. సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా ఇచ్చామని తెలిపారు. ఏపీలో ఐదు‌వేల కిట్లను సిబ్బందికి గురువారం అందించామని, వెయ్యి వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తామన్నారు. ఐదు వందల ప్రదర్శనలు చేపట్టి కేంద్రం చేసిన సంక్షేమ పనుల్ని ప్రజల్లోకి తీసుకెళతామని సత్యకుమార్‌ అన్నారు.

మరిన్ని వార్తలు