ఉదయగిరిలో నివాసాల మధ్య పేలుడు

9 May, 2019 12:29 IST|Sakshi
తనిఖీలు చేస్తున్న డాగ్, బాంబ్‌ స్క్వాడ్‌ బృందం

కలకలం రేపిన ఘటన

నాటు తూటాలు నోట కరింపించుకువచ్చిన శునకం

పేలి మృతిచెందిన వైనం

ఒక్కసారి శబ్ధం రావడంతో ఆందోళనకు గురైన జనం

తనిఖీ చేసిన బాంబ్‌ స్క్వాడ్‌

ఉదయగిరి: పట్టణంలోని గొల్లపాళెంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో బాంబ్‌ పేలుడు కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గొల్ల పాళెంలో అర్ధరాత్రి సమయంలో బాంబ్‌ పేలిన శబ్ధం వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలోని గృహాల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయాందోళనలతో బయటకు వచ్చి చూశారు. ఓ కుక్క తలపగిలిపోయి పొగలు వస్తుండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఎన్‌.ప్రభాకర్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సీఐ సాంబశివరావు బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగీ ఆదేశాల మేరకు గుంటూరు నుంచి బాంబ్‌ స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలను రప్పించి తనిఖీలను చేయించారు. పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి బాంబ్‌ ఏమీలేదని గుర్తించారు. అడవి పందుల బెడద బారి నుంచి కాపాడుకునేందుకు ఎవరో నాటు తూటాలు పెట్టి ఉంటారని, దానిని కుక్క నోట కరపించుకుని గృహ నివాసాల మధ్యకు వచ్చి కొరకడంతో తలపగిలి అక్కడికక్కడే మృతిచెంది ఉండొచ్చని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని సీఐ వెల్లడించారు. కుక్కకు స్థానిక పశు వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహిం చారు. 

మరిన్ని వార్తలు