పాపాయపాలెంలో..బాంబు పేలుళ్లు

3 Apr, 2015 03:42 IST|Sakshi

పాడుబడిన గృహంలో దాచిన వైనం...
గుంటూరులో ఉంటున్న గృహ యజమాని
మారణాయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

 
బెల్లంకొండ : పాడుపడిన ఇంట్లో దాచిపెట్టిన నాటుబాంబులు పేలిన సంఘటన బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో గురువారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ళ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మద్దిగ రామిరెడ్డి గృహంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు దాచి పెట్టగా అవి ఎండలకు పేలాయి. రామిరెడ్డి ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగ విరమణ చేసి గుంటూరులో నివాసం ఉంటున్నారని సీఐ తెలిపారు.

సంఘటన జరిగిన గృహంలో ప్రస్తుతం ఎవరూ నివాసం ఉండటంలేదని, ఐదు నుంచి ఆరు బాంబులు పేలాయని, పలు మారణాయుధాలు కూడా అక్కడ ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

ఇంతకీ ఈ బాంబులు ఎవరివి...?

గ్రామంలో గత సంవత్సరం నుంచి వర్గవిభేదాలతో గొడవలు, కొట్లాటలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం బాంబు పేలుళ్లు సంచలనం కలిగించాయి. మద్దిగ రామిరెడ్డి గత ఏడాది హత్యకు గురైన సింగరెడ్డి వెంకటరామిరెడ్డి సమీప బంధువు కావడంతో ఆ బాంబులు తెలుగుదేశం పార్టీ వారివేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఆరోపిస్తున్నారు.

తాము హత్యకేసులో వాయిదాకు వెళ్లి తిరిగి వస్తుండగా తమపై బాంబులు విసిరారని, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తెలుగుదేశం పార్టీకి చెందిన వారి వద్ద ఇంకా బాంబులు ఉన్నాయని తాము ఎన్నోసార్లు పోలీసులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని వారు ఆరోపించారు. కాగా వారు మాత్రం ఇది వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పనేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దేశం అరాచకాలకు మళ్లీ కాళ్లు !

సాక్షి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలోని అనేక గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. కొందరిని మట్టుబెట్టగా, మరికొందరిని త్రీవంగా గాయపరిచి గ్రామాల్లో భయాం దోళన సృష్టించిన సంఘటనలు నేటికీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఐదు నెలలుగా జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని భావిస్తున్న తరుణంలో,  ఇద్దరు ఎస్పీలు బదిలీ కావడం టీడీపీ అరాచకాలకు మళ్లీ కాళ్లు వచ్చినట్టయింది.

అధికార పార్టీకి చెందిన నాయకులు ఎన్ని దాడులు చేసినా కనీసం కేసులు నమోదుకు సైతం పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. జిల్లాలో నిత్యం చోటుచేసుకుంటున్న టీడీపీ అరాచక పర్వంలో కొన్ని సంఘటనలు...

బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో జనవరి 22న కోర్టు వాయిదాకు వెళ్లి వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయాణిస్తున్న వాహనంపై బాంబులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. గ్రామ నడిబొడ్డున అంతా చూస్తుండగానే అధికార పార్టీకి చెందిన నాయకులు బాంబులు విసురుతూ భయాందోళన సృష్టించారు. అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు కొంత మందిపై మాత్రమే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపడం, మిగతావారిని బైండోవర్ చేయడం గమనార్హం.

ఈ సంఘటన మరుకవముందే గురువారం అదే గ్రామంలోని టీడీపీ నాయకుడి ఇంటిలో ఉంచిన రెండు బాంబులు పేలడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా బాంబుల సంస్కృతికి దూరంగా ఉన్నప్పటికీ పాపాయపాలెం గ్రామంలో రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు బాంబు పేలుళ్లు జరిగినా పోలీసులు చోద్యం చూస్తూనే ఉన్నారు.  బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంగ్రామంలో సర్పంచ్, మాజీ సర్పంచ్‌తోపాటు మరో నలుగురిపై కారం చల్లి రాడ్డులు, గడ్డపలుగులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

గ్రామస్తుల సహాయంతో పోలీస్ స్టేషన్‌కు వెళితే ఫిర్యాదు తీసుకోకుండా పంపి వేశారని బాధితులు వాపోతున్నారు. చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చేర్చగా, గురువారం మధ్యాహ్నం వరకు ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు ఎవరూ రాకపోవడంతో డయల్ 100కు ఫోన్ చేసి  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఓ కానిస్టేబుల్ వచ్చి ఫిర్యాదు స్వీకరించినట్లు తెలిసింది. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు.

తలలు పగిలి నెత్తురోడుతున్న స్థితిలో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు కూడా పోలీసులు ముందుకు రావడం లేదంటే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా నరసరావుపేట పట్టణంలోని జీసీవీ చానల్ కార్యాలయంపై కొద్ది రోజుల కిందట అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అనుచరులు దాడులు చేసి సుమారు రూ. 40 లక్షల విలువ చేసే కేబుల్ వస్తువులను ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినా, ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనించదగ్గ విషయం. ఇలా జిల్లాలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు అంతులేకుండా పోతోంది.

మరిన్ని వార్తలు