సాక్షి, అమరావతి: ఈనెల 15వ తేదీ నుంచి ప్రయాణించేందుకు వీలుగా ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్ఎస్) ద్వారా టిక్కెట్ల బుకింగ్ను ప్రారంభించింది. ఏసీ సర్వీసులను గణనీయంగా తగ్గించి 90% నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ బస్టాండ్ నుంచి నాన్ ఏసీ సర్వీసులను మాత్రమే ఆర్టీసీ ప్రారంభించనుంది. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా వెళ్లేవి మాత్రం ఏసీ సర్వీసులను నడపనున్నారు. కరోనా వైరస్ ఏసీలో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
► విజయవాడ నుంచి హైదరాబాద్కు ఈనెల 15వ తేదీన 115 సర్వీసులకు టిక్కెట్ బుకింగ్స్ అందుబాటులో తీసుకురాగా, వీటిల్లో ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా వెళ్లేవి 10 ఏసీ బస్సులే ఉన్నాయి. మిగిలిన 105 సర్వీసులు సూపర్ లగ్జరీ బస్సులు.
► విజయవాడ నుంచి తిరుపతికి 45 సర్వీసులు నడపనున్నారు. వీటిల్లో కేవలం ఐదు మాత్రమే ఏసీ సర్వీసులు ఉన్నాయి. చెన్నైకు మూడు సర్వీసులు ఉంటే, రెండు సూపర్ లగ్జరీ కాగా ఒకటి ఏసీ సర్వీసు ఉంది. అదీ కూడా కాకినాడ డిపో నుంచి వస్తుంది.