ఆలయాల వద్ద అద్దె గదులు ‘సచివాలయం’లో బుకింగ్‌!

1 Jun, 2020 05:27 IST|Sakshi

ప్రధాన ఆలయాల్లో స్వామి వారి సేవలకు టికెట్లూ పొందొచ్చు

గ్రామ, వార్డు సచివాలయాల్లో లభించే సేవలపై వాట్సాప్‌ ద్వారా వలంటీర్ల ప్రచారం

తమ పరిధిలోని కుటుంబాల ఫోను నంబర్లతో వాట్సాప్‌  గ్రూపుల ఏర్పాటు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు వెళ్లే భక్తులు అక్కడ ఉండడానికి అవసరమైన అద్దె గదులను గ్రామ, వార్డు సచివాలయాలలోనే ముందస్తుగా బుక్‌ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. అన్నవరం, శ్రీకాళహస్తి, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాల్లో స్వామి వారి సేవా టికెట్లను కూడా ముందస్తుగా పొందవచ్చు. ఈ సేవలకు సంబంధించిన వివరాలను వలంటీర్లు తమ  పరిధిలోని అన్ని కుటుంబాలకు వాట్సాప్‌ మెసేజ్‌ల రూపంలో సమాచారం ఇస్తున్నారు. జూన్‌ 8వ తేదీ నుంచి అన్ని ఆలయాల్లో దర్శనాల పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో రాష్ట్రంలో టీటీడీ, దేవదాయ శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

సచివాలయ సేవలపై ప్రచారం.. 
► ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలలో మొత్తం 540 రకాల సేవలు పొందేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాటు చేసింది. 
► ఈ సేవలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాల య శాఖ, వలంటీరు శాఖలను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 
► సచివాలయం ద్వారా ఏయే సేవలు పొందవచ్చో రాష్ట్రంలో ప్రతి కుటుం బానికి వాట్సాప్‌ ద్వారా ప్రచారం చేసేందుకు ఆయా శాఖలు ఇటీవలే ప్రత్యేక కార్యక్రమం చేపట్టాయి.  
► మొదట వలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాల అందరి ఫోను నంబర్లతో ఒక వాట్సాప్‌ గ్రూపును రూపొందిస్తున్నారు.  
► ప్రభుత్వానికి సంబంధించి ప్రతి సమాచారం కూడా ఈ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా కూడా అందరికీ తెలియజేస్తారు. 
► ఆధార్‌ కేవైసీ, ఎలక్ట్రిక్‌ మీటర్‌ కనెక్షన్, ఓటర్‌ ఐడీ అప్లికేషన్, కుటుంబ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్‌ పుస్తకం, ఎఫ్‌ఎంబీ కాపీ, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్, ఈసీ కాపీ, కొత్త రైస్‌ కార్డు, రైస్‌ కార్డులో కొత్త పేర్ల చేరిక, బిల్డింగ్‌ ప్లాన్‌ ఆమోదం, పుట్టిన తేదీ, వివాహ, మరణ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి బస్‌పాస్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల స్లాట్‌ బుకింగ్‌ తదితర మొత్తం సేవల గురించి వలంటీర్లు విస్తృత ప్రచారం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు