‘చంద్రబాబు చేసిన దీక్ష ఓ బోగస్’

11 Nov, 2019 20:55 IST|Sakshi

సాక్షి​, అనంతపురం: ఇంఛార్జి మంత్రి హోదాలో మున్సిపల్‌శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ సోమవారం తొలిసారి జిల్లాలో పర్యటించారు. అనంతపురం జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన దీక్ష ఓ బోగస్ అని.. ఏపీలో ఇసుక పుష్కలంగా లభ్యం అవుతోందని మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని బొత్స ధ్వజమెత్తారు.

భారతదేశ చిత్ర పటంలో ఏపీని లేకుండా చేసిన ఘనుడు చంద్రబాబు అని.. శివరామకృష్ణయ్య నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా అమరావతిలో చంద్రబాబు రాజధాని ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. అందుకే రాజధాని అంశంపై నిపుణుల కమిటీ వేశామని.. అన్ని జిల్లాల్లో పర్యటించి ఈ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. అందరూ అభిప్రాయాలు చెప్పవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారు తమ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో బయటపెట్టాలని స్పష్టం చేశారు. అమరావతిలో పునాది తీయాలంటే 110 అడుగులు తవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని సత్యనారాయణ అన్నారు.

>
మరిన్ని వార్తలు