రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా : బొత్స

25 Aug, 2019 13:20 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. రాజధాని ఏ ఒక్కరిదో, ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినదో కాదని, ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సూచనలను గత టీడీపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా అప్పటి మంత్రి నారాయణ కమిటీ పేరిట నిర్ణయం తీసుకుందని విమర్శించారు. 

అమరావతి ప్రాంతానికి వరద ముంపు ప్రమాదం ఉందని, ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటికే ఈ ప్రాంతం ముంపునకు గురైతే.. 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే పరిస్థితి ఏంటి? అని బొత్స ప్రశ్నించారు. రాజధానిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చేసి వ్యాఖ్యలు ద్వంద్వ అర్థాలను తలపిస్తున్నాయని విమర్శించారు. మాజీ స్పీకర్‌ కోడెల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు