సాక్షి, అమరావతి : గ్రామ సచివాలయ వ్యవస్థ, కంటి వెలుగు పథకాలను తామే ముందు తీసుకొచ్చామని అబద్ధాలు చెబుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కంటిచూపు మందగించినట్లుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయాన్ని చూసి సచివాలయ వ్యవస్థను తానే తీసుకొచ్చానని చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ సచివాలయం వేరు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ వేరు అన్న విషయం బాబు తెలుసుకోవాలని హితవు పలికారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రజారంజక పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
బాబు పాలనలో వందల ఎకరాలు దోచుకున్నారు
‘‘గ్రామ సచివాలయ వ్యవస్థను చంద్రబాబు తెచ్చారనడం సరికాదు. గాంధీజీ స్ఫూర్తితో ప్రభుత్వ పథకాలను ప్రజల గుమ్మం ముందుకు తెవాలని సీఎం వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిన బాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. విశాఖలో భూ కుంభకోణం జరిగిందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు గతంలో ఫిర్యాదు చేశారు. గత ఐదేళ్లు విశాఖపట్నంలో వందల ఎకరాల భూములను చంద్రబాబు, ఆయన కోటరీ దోచుకుతిన్నారు’’ అని బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.
ఖబడ్దార్ అంటూ బాబు బెదిరిస్తున్నారు
‘‘చంద్రబాబు నోటికి ఏదొస్తే అది స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నారు. ఏమైనా అంటే ఖబడ్దార్ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేపై అభియోగం వస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. చంద్రబాబు పాలనలో నిందితులను చంద్రబాబు ఇంటికి పిలిచి సెటిల్మెంట్లు చేశారు. రూ.2.50 లక్షల కోట్ల అప్పు కాకుండా ఎం–బుక్కులు రికార్డు చేయకుండా చంద్రబాబు రూ.50 వేల కోట్ల అప్పు చేసింది వాస్తవం కాదా? రాజధానిపై నిపుణుల కమిటీ వేశాం. కమిటీ సిఫార్సులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.