'రిజర్వేషన్లు అడ్డుకుంటూనే మొసలి కన్నీరు'

6 Mar, 2020 14:16 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త సంస్కరణలు తేవడం గొప్ప విషయమని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు, మద్యం పంచకుండా కఠిన చట్టాన్ని అమలుపరచడం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచుతూ పట్టుబడితే మూడేళ్ల జైలుతో పాటు, అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందన్నారు. బీసీలకు మేలు చేసేందుకే సీఎం జగన్‌ 58.95 శాతం రిజర్వేషన్లు తెచ్చారని వెల్లడించారు.

అయితే బీసీ రిజర్వేషన్లను టీడీపీ నేతలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. తన మనుషులతో రిజర్వేషన్లు అడ్డుకొని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్‌ సీపీ గెలుపు చాలా కీలకం అని బొత్స పేర్కొన్నారు. అనంతపురం స్థానిక సమరంలో అన్ని స్థానాలు గెలచి, టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పాలని మంత్రి బొత్స పిలుపునిచ్చారు. 

స్థానిక సంస్థల్లో వైఎస్సార్ సీపీ గెలుపు చాలా అవసరమన్న మంత్రి బొత్స... ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే పంచాయతీ, పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నేతలు గెలవాలని అన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. వచ్చే ఉగాది నాటికి 25లక్షల మంది పేదలకు ఇంటిస్థలాలు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని వెల్లడించారు. 

(మేమంటే నీకంత ద్వేషమా.. బాబూ?)

(హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం)

మరిన్ని వార్తలు