పట్టణ ప్రాంత నిర్మాణాల్లోనూ రివర్స్‌ టెండరింగ్‌: మంత్రి బొత్స

16 Oct, 2019 18:53 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అవినీతికి తావు లేకుండా అమలు చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పట్టణ ప్రాంత గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లోనూ రివర్స్ టెండరింగ్ చేపడుతన్నట్లు మంత్రి బొత్స తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏపీ టిడ్కోలో సైతం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు 

ఈ నేపథ్యంలో టిడ్కో ఆధ్వర్వంలోని వివిధ గృహ నిర్మాణ, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల పనుల పురోగతి, స్థితిగతులు సమీక్షించి దీనిపై రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టాలన్న ఉత్తర్వులపై మంత్రి సంతకం చేశారు. రివర్స్ టెండరింగ్‌లో అనుసరించాల్సిన విధి విధానాలను ఖరారు చేశారు. దీంతో ప్రాజెక్టుల వ్యయం తగ్గి రాష్ట్ర ఖజానాపై భారం తగ్గడంతో పాటు, ఆయా పథకాల్లోని లబ్ధిదారులపై కూడా ఆర్ధిక భారం తగ్గుతుందని అన్నారు. ఈ మార్గదర్శకాలకు అనుగునంగా టిడ్కో నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. గత ప్రభుత్వం అధిక ధరలకు టెండర్లు ఖరారు చేస్తూ, ప్రజాధనం దుర్వినియోగం అయ్యేలా వ్యవహరించిందని మండిపడ్డారు. ఇప్పడు ఆ తీరుకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలతో ముందుకు పోతుందని తెలిపారు. అప్పటికే ప్రారంభం కాని పనులను రద్దు చేయడం, కొనసాగుతున్న పనులను  పునః సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. 

 
 

మరిన్ని వార్తలు