త్వరలోనే పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి: బొత్స

13 Aug, 2019 15:55 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన భూముల్లో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా ప్రారంభం కాలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్‌ పూలింగ్‌పై గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన ప్రాంతాల్లో టెండర్‌లు పిలవలేదు.. టిడ్‌కోకు కూడా భూమిని కేటాయించలేదని తెలిపారు. త్వరలోనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లన్నింటిని పూర్తి చేస్తామని తెలిపారు. యారాడతో పాటు మరో నాలుగైదు పెద్ద ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

శ్రీకాకుళం, రాజమండ్రి, బొబ్బిలి డెవలప్‌మెంట్‌ బోర్డులు ఏర్పడిన తర్వాత వీఎంఆర్డీఏ పరిధి తగ్గిందన్నారు. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. బీచ్‌రోడ్డు అభివృద్ధిపై గత ప్రభుత్వం హయాంలో ఉన్న ప్రతిపాదనలను సమీక్షిస్తున్నామన్నారు.  మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసినప్పుడే ఎడ్యూకేషన్‌ హబ్‌, పరిశ్రమల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, హెల్త్‌ వంటివి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయం తీసుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు