వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి వ్యవసాయం బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ‘మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో రైతులు, కౌలు రైతులకు భరోసా కల్పించారు. కౌలు చట్టంలో మార్పులు తీసుకొస్తాం. పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. సున్నా వడ్డీకే రైతుకు రుణం ఇవ్వడం రైతులకు పెద్ద ఊరట. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం అందిస్తాం. ఎలాంటి కష్టం వచ్చినా ఆత్మహత్యలకు పాల్పడవద్దని మా ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. రైతులు, కౌలు రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా కలెక్టర్లు వెంటనే స్పందించాలి. రైతులు ఏ దశలోనూ మోసపోకుండా చూడాలన్నదే మా ధ్యేయం. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశామ’ని తెలిపారు.
చదవండి: ఏపీ బడ్జెట్ లైవ్ అప్డేట్స్