రాజంపేట : ఆర్టీసీలో కొనసాగిస్తున్న గ్రౌండ్ బుకింగ్కు బ్రేక్ పడింది. కరోనా లాక్డౌన్ తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడిపింది. మే 21 నుంచి గ్రౌండ్ బుకింగ్ ద్వారా ప్రయాణీకులను బస్సు ఎక్కించి వారి గమ్యాలకు చేర్చే ప్రక్రియను కొనసాగించారు. జిల్లాలో 8 డిపోలు ఉన్నాయి. దాదాపు 1000 మందికిపైగా కండక్టర్లు ఉన్నారు. జిల్లాలో 350లోపు సర్వీసులుప్రస్తుతపరిస్థితిలో ఆర్టీసీ నడిపిస్తోంది.
కలెక్షన్ డౌన్..
గ్రౌండ్ బుకింగ్ ప్రక్రియ ద్వారా కలెక్షన్ బాగా తగ్గిపోయింది. ఈ ప్రక్రియ ద్వారా బస్సులు సకాలంలో నడిపించలేకపోతున్నారు. బస్సులలో ప్రయాణీకులు ఆయా బస్టాండు కేంద్రాల నుంచి టికెట్స్ ఇచ్చి ఎక్కించడం వల్ల బస్సులు రాకపోకలు తీవ్రమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. గంటకు చేరాల్సిన బస్సు ఒకటిన్నర గంటకుపైగా సమయం పడుతోంది. ప్రయాణీకులు బస్సుల ద్వారా ప్రయాణం చేయడం బాగా తగ్గిపోయింది. దీని వల్ల ఆర్టీసీకి నష్టం కలుగుతోంది. దీంతో ఈ విధానానికి స్వస్తి పలికేందుకు ఆర్టీసీ నిర్ణయించుకుంది. అంతేగాకుండా పల్లెలకు బస్సులు తిప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.
నేటి నుంచి విధులకు కండక్టర్లు..
ఇన్నాళ్లుగా బస్టాండులలో గ్రౌండ్ బుకింగ్ విధులు నిర్వహించిన కండక్టర్లు గురువారం నుంచి బస్సెక్కనున్నారు. బస్సులోనే కండక్టర్ ఉంటే సకాలంలో బస్సులు నడుస్తాయి. అంతేగాకుండా టికెట్ జారీ విషయంలో జాప్యం జరగదు. ప్రయాణీకులు కూడా బస్సులను ఆశ్రయించేందుకు వీలవుతుంది. బుధవారం నుంచి కండక్టర్లకు డ్యూటీలను ఆర్టీసీ అధికారులు వేశారు. ఈ విషయంపై ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ జీవీనరసయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ కండక్టర్లు బస్సులోనే వి«ధులు నిర్వహించేలా ఆర్టీసీ ఆదేశించిందని స్పష్టంచేశారు. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ అయినట్లు వెల్లడించారు.