బాధను దిగమింగి.. చెల్లిని నిద్రపుచ్చుతూ

11 Mar, 2020 08:32 IST|Sakshi

సాక్షి, పుట్లూరు : అమ్మ ప్రేమ కమ్మనిది.. నాన్న ప్రేమ చల్లనిది.. రెండూ కలగలిస్తే అన్న.  ప్రమాదం జరిగి  ఒంటిపై గాయాలు బాధ కలిగిస్తున్నా జ్వరంతో బాధపడుతున్న చెల్లిని అన్న తన ఒడిలో నిద్రపుచ్చుతున్న దృశ్యమిది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని ఎ.కొండాపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వేగంగా వస్తున్న ఆటో బోల్తాకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వరలక్ష్మి కుమారుడు మోహిత్‌రాం (3) అనే బాలుడు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కుమార్తెకు జ్వరం వస్తుండటంతో చికిత్స చేయించేందుకు వెళ్తున్న కర్నూలు జిల్లా తుమ్మలపెంట గ్రామానికి చెందిన సతీష్‌కుమార్, మహిత, వీరి కుమారుడు వంశీకృష్ణకు తీవ్రంగా గాయాలయ్యాయి. కుమార్తెకు ప్రమాదం తప్పింది. అయితే, తల్లిదండ్రులిద్దరికీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నప్పుడు చిన్నారికి తొమ్మిదేళ్ల అన్న తన గాయాల బాధను భరిస్తూనే అన్నీ తానై సపర్యలు చేశాడు. తర్వాత తల్లికి చికిత్స చేస్తున్న బెడ్‌ పక్కనే తన ఒడిలో చెల్లిని నిద్రపుచ్చుతున్న దృశ్యాలు ఆసుపత్రుకి వచ్చిన వారి హృదయాలను కదిలించాయి.  

మరిన్ని వార్తలు