పట్టపగలు వ్యక్తి దారుణ హత్య

31 Jul, 2015 17:04 IST|Sakshi

రైల్వేకోడూరు (వైఎస్సార్‌జిల్లా) : పాత కక్షలతో ఒక వ్యక్తిని అతి దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం లక్ష్మిగిరిపల్లె వద్ద శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అబ్బినాయుడుపల్లెకు చెందిన కె. శంకరయ్య(38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఆయనకు కొందరు వ్యక్తులతో పాతగొడవలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో శంకరయ్య కడప నుంచి తిరుపతికి వెళ్తుండగా.. రహదారిలోని లక్ష్మిగిరిపల్లె సమీపంలో కాపు కాసిన ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. బండరాళ్లతో తలపై బలంగా మోదడంతో శంకరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హంతకులు అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, సుబ్బారాయుడులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు