యువకుడి దారుణ హత్య

31 May, 2015 02:15 IST|Sakshi

 సీతంపేట:  సామరెల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు మీనక శరత్‌కుమార్(20) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. భూతగాదాల నేపథ్యంలో బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. హత్యకు గురైన యువకుడి తల్లి కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సామరెల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌కు ఇద్దరు భార్యలు శాంతమ్మ, పూర్ణమ్మ ఉన్నారు. అయితే కొద్ది నెలల క్రితం వెంకటేశ్ చనిపోవడంతో ఇద్దరి భార్యల మధ్య భూమి విషయమై తగాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పూర్ణమ్మ కుమారుడైన శరత్‌కుమార్ ఈనెల 28న అచ్చిబలో జరిగిన బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు.
 
 దీంతో తల్లి పూర్ణమ్మ కుమారుడి ఆచూకీ కోసం గాలించింది. ఈలోగా అచ్చిబ నుంచి అంటికొండకు వెళ్లే దారి పక్కన శరత్ మృతదేహం ఉన్నట్టు సమాచారం రావడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. వెళ్లి చూడగా తల, శరీరంపై తీవ్రగాయాలుండడంతో హత్యకు గురైనట్టు నిర్థారణకు వచ్చింది. ఈ దారుణానికి వెంకటేశ్ భార్య శాంతమ్మ కుమారుడు కొండలరావు, ఆయన బావ సుందరరావు పాల్పడి ఉంటారని అనుమానిస్తూ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ, కొత్తూరు సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ శ్రీనివాసరావులు శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు