రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలసొమ్ము దోచుకున్నారు
ఓట్లు అడగడానికి వచ్చే టీడీపీ నాయకులను నిలదీయండి
పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
కర్నూలు , బేతంచెర్ల: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు దోచుక తినడం తప్పా అభివృద్ధి చేసింది లేదని, పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సిమెంట్నగర్ గ్రామంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోలేక ప్రజా సంకల్పయాత్రలో విశేష జనాధరణను చూసి భయపడి నవరాత్నాల్లో ఒకటైన పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని సీఎం కాపీ కొట్టాడని విమర్శించారు. అధికారపార్టీ నాయకులు ప్రతి పనికో రేటు కట్టి దోచుకున్నారని వివరించారు. 2లక్షల మంది ఓటర్లు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే, ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అని, పింఛన్, రేషన్కార్డు, ఇల్లు మంజూరు చేసే అధికారం కూడా ఇవ్వలేదన్నారు. నియోకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల పనులకు కమీషన్లు దండుకున్నాడని మండిపడ్డారు.
80 ఏళ్ల డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, తన తమ్ముడు 70 ఏళ్ల కేఈ ప్రతాప్ను చంకలో పెట్టుకొని నియోజకవర్గంలో తిరగడం ఎంత వరకూ సమంజసం అన్నారు. కోడుమూరు నియోజకవర్గం లద్దగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి, పత్తి కొండ నియోజకవర్గం, కంబాలపాడుకు చెందిన టీడీపీ అభ్యర్థికి డోన్ నియోజకవర్గంలో పనేంటని ప్రశ్నించారు. ఒక్కసారి వైఎస్సార్సీపీకి అవకాశం ఇస్తే, అధికారంలోకి రాగానే పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెస్తానన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకుతిన్న టీడీపీ నాయకులను ఓట్ల కోసం వచ్చినప్పుడు నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు యాకోబ్, రామచంద్రుడు, ఎంపీటీసీ సభ్యులు ఎస్తేరమ్మ, రమణమ్మ, మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, రోశన్న, బండి కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.