బాబు గిమ్మిక్కులను ప్రజలు నమ్మరు

20 Aug, 2017 04:16 IST|Sakshi
బాబు గిమ్మిక్కులను ప్రజలు నమ్మరు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన
 
సాక్షి బృందం, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న గిమ్మిక్కులను ప్రజలు నమ్మరని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఆయన శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 2014లో 600 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఓటమి భయంతో సీఎం అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. వేలాది రూపాయలు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని గెలవాలని చూసే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ ఎన్నికలు 2019 ఎన్నికలకు నాంది కావాలని, చంద్రబాబుకు కనువిప్పు కావాలని చెప్పారు. జనంలోకి జగన్‌ వస్తుంటే ప్రజలు హారతులు పడుతున్నారని, బాబు వస్తే భయంతో పరుగుదీసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను, అధికారులను భయభ్రాంతులకు గురి చేసి లబ్ధి పొందేందుకు కుట్రలు పన్నుతున్నారని, చివరకు ఎన్నికలు వాయిదా వేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహానేత వైఎస్సార్‌ ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, ఇప్పుడు రాక్షస పాలన సాగుతున్నట్లు ఉందన్నారు. రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గపు పాలన ఏనాడూ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  
మరిన్ని వార్తలు