పర్యాటక ప్రాంతంగా గొట్టాబ్యారేజీ అభివృద్ధి

15 Jul, 2015 01:20 IST|Sakshi

ఎల్.ఎన్.పేట(హిరమండలం) : వంశధార నదిపై హిరమండలం వద్ద ఉన్న గొట్టాబ్యారేజీ పరిసర ప్రాంతాన్ని టూరిజం పార్క్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అన్నారు. గొట్టాబ్యారేజీను ఆయన మంగళవారం పరిశీలించారు. బ్యారేజీకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని గేట్లు ఉన్నాయి, కాలువులకు నీరు ఎంత విడిచిపెట్టే అవకాశం ఉంది, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది అనే విషయాలను వంశధార ఎస్‌ఈ బి.రాంబాబును అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీకి సమీపంలో ఉన్న గులుమూరు, మహాలక్ష్మీపురం, (ఎం.ఎల్.పురం), భరీరథపురం ప్రాంతాలను కలుపుతూ టూరిజంగా అభివృద్ధి పర్చేందుకు ఆయా శాఖల అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
 
 వంశధార నదిలో నివగాం బ్రిడ్జి వద్ద ఎక్కువగా ఉన్న ఇసుక మేటల తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. వంశధార రిజర్వాయర్ నిర్వాసితులు గొంతెమ్మ కొర్కెలు కోరడం తగదని, న్యాయమైన కోర్కెలన్నీ తీరుస్తామని చెప్పారు. నీరు-చెట్టు పథకం కింద నదిలో తీసిన ట్రాక్టర్ మట్టిని రూ.200 చొప్పున అధికారులు విక్రయించేశారని కొండరాగోలు మాజీ సర్పంచ్ మూకళ్ల చిన్నయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నీరు-చెట్టు ఈఈ గోపాలరావు, తహశీల్దారు జె.రామారావు, వంశధార ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు