‘డ్వాక్రా మహిళలతోనే కేసులు పెట్టిస్తాం’

6 Feb, 2019 12:28 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: ఎన్నికల వేళ ప్రజలు మభ్యపెట్టే విధంగా ఏపీ బడ్జెట్‌ను రూపొందించారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సీ రామచంద్రయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాశాయని మండిపడ్డారు. ప్రజలు తరతరాలు అప్పులు కట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తున్నాడని, ప్రతిఏడాది అప్పులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని విమర్శించారు. జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యమనీ, రాబోయే ఎన్నికల్లో గెలిచే సీన్‌ చంద్రబాబుకు లేదని ఆయన జోస్యం చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకానికి నిధులు ఎలా వస్తాయో స్పష్టత లేదని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఓడిస్తారని చంద్రబబాకు ముందే తెలుసని అందుకు కొత్త నాటకాలు ఆడుతున్నారని రామచంద్రయ్య పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో ప్రశ్నించిన వారిని స్పీకర్‌ సాక్షిగా చంద్రబాబు బెదిరిస్తున్నారని అన్నారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయితే వారిచేతని కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు.

వైఎస్సార్‌సీపీ 150 సీట్లు సాధిస్తుంది..
గత ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను మరిచి చంద్రబాబు నాయుడు కొత్త నాటకాలకు తెర తీశారని మైదుకూరు  ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమను ఆర్భాటంగా శంకుస్థాపన చేసి బడ్జెట్‌లో ఒక్కరూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. చంద్రబాబు మోసాని ప్రజలు గమనించాలని, సర్వేల ప్రకారం ఆయనకు ఓటమి తప్పదని చెప్పారు. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 150 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ తనను ఓడించాలని శతవిధాల ప్రయత్న చేశారని, కానీ ప్రజలు వారి ఎత్తుగడలను తిప్పికొట్టారని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు