అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నారు

24 Dec, 2019 16:01 IST|Sakshi

సాక్షి, రాయచోటి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి నాయకుల వల్లే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. అడగకుండానే సీఎం జగన్‌ అన్నీ చేసేస్తున్నారని, ఆయన చేతికి ఎముక ఉందా అన్న అనుమానం కూడా కలుగుతోందని అన్నారు. వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏ‍ర్పాటు చేసిన సభలో రామచంద్రయ్య మాట్లాడుతూ... అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తానన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. తాను రెండుసార్లు మంత్రిగా పనిచేసినా రాయచోటిలో ఇంత అభివృద్ధి చేయలేకపోయానని, ఇందుకు సిగ్గు పడుతున్నానని ఆయన అన్నారు.

ఆరు నెలల్లోనే చరిత్ర సృష్టించారు
అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యమని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిగా మొదటి ఆరు నెలల్లోనే వైఎస్‌ జగన్‌ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. (చదవండి: రాయచోటిలో అభివృద్ధి పనులకు శ్రీకారం)

మరిన్ని వార్తలు