హోదాకోసం 26న కొవ్వొత్తుల ప్రదర్శన

23 Jan, 2017 06:36 IST|Sakshi
హోదాకోసం 26న కొవ్వొత్తుల ప్రదర్శన
  • జల్లికట్టు ఉద్యమస్ఫూర్తితో ఉధృత పోరాటం
  • వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ పిలుపు
  • సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తమిళనాడు జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మరింత ఉధృత పోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రిపబ్లిక్‌ డే జనవరి 26వ తేదీన విశాఖపట్నం బీచ్‌ ఒడ్డున వేలాదిమంది ప్రజలతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. తమిళనాడులోని సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును సవాల్‌ చేసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి మూడు, నాలుగురోజుల్లో ఆర్డినెన్స్‌ తెచ్చేలా చేసిన అక్కడి ఉద్యమస్ఫూర్తి ఇక్కడ ప్రత్యేక హోదా కోసం రగలాలని ఆయన ఆకాంక్షించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఏపీకి ప్రత్యేక హోదా హామీని అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా అటు బీజేపీ ఇటు టీడీపీ గాలికొదిలేశాయని ఆయన విమర్శించారు. హోదా అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన  ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద  సాగిలపడ్డారని ధ్వజమెత్తారు.