రైలులో రేషన్ బియ్యం పట్టివేత

21 Jun, 2015 01:45 IST|Sakshi

ఒంగోలు క్రైం : ప్యాసింజర్ రైలులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఒంగోలు రైల్వే జీఆర్‌పీ పోలీసులు శనివారం పట్టుకున్నారు. విజయవాడ-ఒంగోలు (ట్రైన్ నంబర్-67263) ప్యాసింజర్‌లో రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం ఒంగోలు రైల్వే జీఆర్‌పీ సీఐ కె.వెంకటేశ్వరరావుకు అందింది. దీంతో ఆయన తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం ఒంగోలు రైల్వేస్టేషన్‌కు ప్యాసింజర్ రైలు రాగానే ఎస్సై పి.భావనారాయణ రైలు బోగీలన్నీ కానిస్టేబుళ్లతో తనిఖీ చేయిం చారు. రైలు పెట్టెకు ఒక బస్తా చొప్పున 11 రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయి.
 
 ఒక్కో బియ్యం బస్తా బరువు సుమారు 40 నుంచి 50 కేజీల వరకు ఉంది. అంటే దాదాపు అరటన్ను బియ్యమన్నమాట. వెంటనే ఆ బియ్యాన్ని ఒంగోలు రైల్వేస్టేషన్‌లో దించి వాటిని జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బియ్యం పట్టుకున్న వారిలో ఎస్సైతో పాటు హెడ్‌కానిస్టేబుల్ వీఆర్‌కే రెడ్డి, స్టేషన్ రైటర్ చలపతిరావుతో పాటు సిబ్బంది ఉన్నారు. సమాచారాన్ని ఒంగోలు సివిల్ సప్లయిస్ అధికారులకు అందజేశారు.  బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని గోడౌన్‌కు తరలిస్తారు. అయితే ఈ బియ్యం తమవని ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు