కలకలం రేపిన కారు

15 Sep, 2013 04:15 IST|Sakshi
ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన కారు ఏలూరులో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి. ఏపీ 16ఎం 4869 నంబర్ గల మారుతీ 800 కారును గుర్తుతెలియని వ్యక్తులు కొద్ది రోజుల క్రితం స్థానిక ఐఏడీపీ హాల్ సమీపంలో పార్క్ చేశారు. శనివారం ఉదయం ఆ కారు ఉన్న ప్రదేశం నుంచి దుర్వాసన రావడం మొదలైంది. స్థానికులు కారులో మృతదేహం ఉందేమోనని అనుమానించారు. 
 
ఈ వార్త నగరంలో గుప్పుమనడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ గుమిగూడారు. త్రీటౌన్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలన చేశారు. కారులో ఏమీ కనిపించకపోవడంతో పరిసరాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలోని డీఈవో, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద గాలించి డ్రెయిన్‌లో కుక్క మృతదేహాన్ని గుర్తించారు. బాగా కుళ్లిపోవడంతో అక్కడి నుంచి దుర్వాసన వస్తున్నట్లు ధ్రువీకరించారు. పార్కు చేసిన కారు ఎవరిదనే విషయం తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 
 
మరిన్ని వార్తలు