కారు కాబట్టి సరిపోయింది..!

23 Jun, 2018 13:09 IST|Sakshi
గాంధీరోడ్డులో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన గుంతలో దిగబడిన కారు

ఒంగోలు: అవును మీరు విన్నది నిజమే..అక్కడ కారు కాబట్టి సరిపోయింది..అదే ఏ మనిషో అయితే∙ప్రాణాలు గోవిందా.. నిత్యం రద్దీగా ఉండే నాలుగురోడ్ల కూడలిగా ఉన్న ఒంగోలు గాంధీరోడ్డులో గాంధీబొమ్మకు ఎదురుగా మున్సిపల్‌ అధికారులు ఒక అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సౌకర్యాన్ని ఎప్పటి నుంచో ఏర్పాటు చేశారు. అయితే గత పదిరోజుల క్రితం ఈ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ క్లీన్‌ చేసే ఉద్దేశ్యంతో దానిపైన ఉన్న మూతను తొలగించారు. అనంతరం మూతను ఏర్పాటు చేయడం మరిచారు. అటుగా వచ్చే వాహనాలు రద్దీలో గుంతను గమనించక పోవడంతో గుంతలో వాహనాల చక్రాలు దిగబడి పోతున్నాయి. ఫలితంగా గాయాల పాలవుతున్నారు.

శుక్రవారం సాయంత్రం ఒక కారు గుంతలో చిక్కుకు పోయింది. దీంతో కారును పైకి లేపేందుకు వాహనదారునితోపాటు స్థాని కులు పడరాని పాట్లు పడ్డారు. ఇది నిత్యం పట్టణంలో జరుగుతున్నా మున్సిపల్‌ సిబ్బందికి ఏ మాత్రం చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదు. పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రయాణికుల భద్రతపై ఉండటం లేదని స్థాని కులు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు దృష్టి సారించి తక్షణమే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీపై మూత ఏర్పాటు చేయించి ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు