అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం

15 Jun, 2020 13:34 IST|Sakshi

స్టేషన్‌లోంచి నిందితుడిని తీసుకెళ్లిన వైనం

సాక్షి, ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న నిందితుడిని దౌర్జన్యంగా తీసుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలో పడకండ్ల గ్రామంలో కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ శూలం నరసింహుడు ప్రత్యర్థులపై దాడి చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లోకెళ్లి అడ్డొచ్చిన పోలీసులను తోసేసి నిందితుడిని తీసుకెళ్లాడు. (అఖిలప్రియపై సంచలన ఆరోపణలు)

ఈ విషయాన్ని స్టేషన్‌ సిబ్బంది పోలీస్‌ ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు అఖిలప్రియ ఇంటి వద్దకెళ్లి మళ్లీ నిందితుడిని స్టేషన్‌ తీసుకెళ్లారు. దీంతో భూమా విఖ్యాత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 224, 225, 212 సెక్షన్ల కింది కేసు ఫైల్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు