రూ.15 లక్షలు ఎగ్గొట్టిన కోడెల కుమార్తెపై కేసు

27 Aug, 2019 09:38 IST|Sakshi

నరసరావుపేట టౌన్‌: మాజీ స్పీకర్‌ కోడెల వరప్రసాదరావు కుమార్తె డాక్టర్‌ పూనాటి విజయలక్ష్మిపై సోమవారం మరో కేసు నమోదైంది. తమ నుంచి సర్జికల్‌ కాటన్‌ కొనుగోలు చేసి రూ.15 లక్షలను ఎగ్గొట్టారంటూ ఖమ్మం జిల్లా కొత్తూరు కు  చెందిన చల్లా రవీంద్రరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రవీంద్రరెడ్డి డాక్టర్‌ పూనాటి విజయలక్ష్మికి చెందిన సేఫ్‌ ఫార్ములేషన్‌ లిమిటెడ్‌ కంపెనీకి నాలుగేళ్లుగా సర్జికల్‌ కాటన్‌ విక్రయిస్తున్నారు.

గడచిన ఏడాది ఆ కంపెనీకి రూ.36 లక్షల విలువైన కాటన్‌ సరఫరా చేయగా.. రూ.21 లక్షలను తిరిగి చెల్లించారు. మిగిలిన రూ.15 లక్షల కోసం రవీంద్రరెడ్డి విజయలక్ష్మి వద్దకు వెళ్లగా ఆమె అసభ్య పదజాలంతో దూషించారు. తనను తన్ని తరిమేయాలని కంపెనీ జనరల్‌ మేనేజర్‌ రామకృష్ణ, మరో ఉద్యోగి నాగేశ్వరరావును ఆదేశించటంతో వారు తనపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విజయలక్ష్మి, మరో ఇద్దరిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు.  

మరిన్ని వార్తలు