ఆశ్రయమిచ్చిన వారిపై కేసులు : డీజీపీ

28 Mar, 2020 17:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. అందరూ కలిసి కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణలో మనల్ని మనం కాపాడుకుందామని సూచించారు. అమరావతి గ్రామాల్లో కొందరు సమాచారం ఇవ్వకుండా దాక్కున్నారని తెలిసిందన్నారు. ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వారిపై కేసుల నమోదు చేస్తామన్నారు. చుట్టూ ఉన్న సమాజానికి నష్టం చేయొద్దన్నారు. 45 వేల మందికిపైగా నిబంధనలు ఉల్లంఘించారన్నారు. వీరంతా వెంటనే వైద్య బృందాలకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ప్రజలంతా అర్ధం చేసుకోవాలని కోరారు. ఇదంతా మీ కుటుంబ సభ్యుల కోసమేనని తెలుసుకోవాలని పేర్కొన్నారు.

పోలీసులకు అందరూ సహకరించాలన్నారు. వైరస్‌ వ్యాప్తి చెయిన్‌ను బ్రేక్‌ చేద్దామని తెలిపారు. ఇంట్లోనే ఉండి, సురక్షితంగా ఉందామన్నారు. ఖాళీ రోడ్లపై యాక్సిడెంట్లు జరిగిన విషయం తెలిసిందన్నారు. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండేలా ఆదేశాలిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు.

మరిన్ని వార్తలు