పిల్లి దొరికే వరకు వెళ్లేది లేదు

10 Jul, 2019 10:00 IST|Sakshi
సూరత్‌ దంపతులతో మాట్లాడుతున్న రేణిగుంట జీఆర్‌పీ సీఐ అశోక్‌ 

జీఆర్‌పీ సీఐకు విన్నవించిన సూరత్‌ దంపతులు

సాక్షి, రేణిగుంట : పిల్లితో పెనవేసుకున్న బంధాన్ని ఆ దంపతులు మరువలేకున్నారు. 27రోజుల కిందట రేణిగుంట రైల్వేస్టేషన్లలో అదృశ్యమైన పిల్లి తమకు సురక్షితంగా దొరికే వరకు ఇక్కడి నుంచి వెళ్లబోమని సూరత్‌ దంపతులు భీష్మించడం ప్రస్తుతం రైల్వే పోలీసులను అయోమయానికి గురిచేస్తోంది. సాక్షిలో మంగళవారం ‘పిల్లి కోసం తల్లడిల్లుతూ...’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో.. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో రేణిగుంట జీఆర్‌పీ సీఐ అశోక్‌ స్పందించారు.

పిల్లిని పోగొట్టుకున్న సూరత్‌ దంపతులు జయేష్‌బాబు, మీనలను మంగళవారం ఆయన పిలిపించి విచారించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాము సాధ్యమైనంత మేరకు పిల్లిని వెతికిపెడతామని, వివరాలను ఇచ్చి స్వస్థలానికి వెళ్లాలని ఆయన వారిని కోరారు. అయితే ఇక్కడే ప్రాణాలను వదిలేందుకు తాము సిద్ధమే కానీ, కన్నబిడ్డ కంటే ఎక్కువగా భావిస్తున్న తమ పిల్లి ‘బాబు’ దొరికే వరకు ఇక్కడ నుంచి ఎక్కడికీ వెళ్లమని స్పష్టం చేశారు. దీంతో పోలీసు అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

మరిన్ని వార్తలు