టీచర్ల ఇళ్ల వద్దే మూల్యాంకనం

11 May, 2020 04:00 IST|Sakshi

10, 12 తరగతులపై సీబీఎస్‌ఈ నిర్ణయం

టీచర్ల ఇళ్లకు 1.5 కోట్ల సమాధాన పత్రాలు

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నేపథ్యంలో తమ పబ్లిక్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకన విధానంలో కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్పులు చేసింది. ఒకేచోట ఎగ్జామినర్లందరినీ కూర్చోబెట్టి మూల్యాంకనాన్ని చేయించే బదులు, వాటిని టీచర్లకిచ్చి వారి ఇళ్ల వద్దే మూల్యాంకనం చేయించేలా ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ పరిధిలోని కేంద్రీయ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే 2020 పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని టీచర్ల ఇళ్ల వద్దే చేయించనుంది. 

 – సీబీఎస్‌ఈ పదో తరగతిలో మిగిలి ఉన్న పేపర్లకు, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి ఇటీవలే సీబీఎస్‌ఈ షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. జూలై ఒకటో తేదీ నుంచి 12 వరకు ఇవి జరుగుతాయి. 
– ఈ పరీక్షల కోసం బోర్డు గతంలో టెన్త్‌కు 5,376 సెంటర్లు, 12వ తరగతికి 4,983 సెంటర్లను ఏర్పాటుచేసింది. 
– ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది హాజరవుతున్నారు.
– పరీక్షలు రాసేటప్పుడు భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున పరీక్ష కేంద్రాల సంఖ్యలో మార్పులు జరగనున్నాయి.
–  వీటి సమాధాన పత్రాలను టీచర్లతో వారి ఇళ్ల వద్దే మూల్యాంకనం చేయించేలా చర్యలు చేపట్టినట్టు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌పోఖ్రియాల్‌ నిశాంక్‌ ఆదివారం మీడియాతో చెప్పారు. 
– ఆయా విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులను అనుసరించి మొత్తం 1.50 కోట్ల పరీక్ష పత్రాలను ఎగ్జామినర్ల ద్వారా ఇళ్ల వద్దే దిద్దించాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు