ఇంట్లోనూ నిఘానేత్రం 

12 Aug, 2019 05:03 IST|Sakshi

14,200 సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసుల ప్రతిపాదనలు  

నేర పరిశోధనలో కీలకంగా మారిన సీసీ కెమెరాలు 

నేరం జరగ్గానే ముందు చూసేది సీసీ కెమెరాల పుటేజ్‌నే 

ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాల కన్ను 

- ఒడిశా రాష్ట్రంలో రూ.13.50 లక్షల విలువైన పేపర్‌ రోల్స్‌తో బయలుదేరిన లారీ బెంగళూరుకు చేరకుండా దారి మళ్లించి 14 చెక్‌పోస్టులు దాటుకెళ్లిపోయినప్పటికీ పట్టుకున్న విజయనగరం వన్‌టౌన్‌ పోలీసులు అవార్డు ఫర్‌ బెస్ట్‌ క్రైమ్‌ డిటెక్షన్‌ (ఏబీసీడీ అవార్డు)ను అందుకున్నారు. అదేమంటే వారి నేర  పరిశోధనలో చెక్‌పోస్టుల వద్ద ఉన్న  క్లోజ్డ్‌ సర్క్యూట్‌ (సీసీ)కెమెరాలే కీలకంగా ఉపయోగపడ్డాయి.  

- కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన షేక్‌ అబ్దుల్‌ ఖదీర్‌(26) హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులకు కూడా అవార్డు లభించింది. మిస్టరీగా మారిన ఈ కేసులో కూడా వాట్సాప్‌ చాటింగ్‌ కొంత క్లూ ఇస్తే నేర స్థలంలో ఉన్న సీసీ కెమెరాలే నేరస్తులను గుర్తించేలా దోహదపడ్డాయి.  

సాక్షి, అమరావతి: ఇలా సీసీ కెమెరాల పుటేజ్‌ పోలీసులకు కీలకంగా మారింది. దీంతో అన్నిప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలు,  జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్, జన సంచారం ఉంటే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లతో అనుసంధానించారు. రాష్ట్ర పోలీస్‌ శాఖ పరిధిలో 8,148 సీసీ కెమెరాలను నిర్వహిస్తున్నారు. దీనికితోడు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌(ఆరీ్టజీఎస్‌) ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామ స్థాయిలోనూ అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 5,200 సీసీ కెమెరాలు ఉండగా మరో 14,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ఈ ఏడాది జూలైలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితోపాటు ప్రతీ ఇంటింటికి నిఘా నేత్రాన్ని విస్తరించేలా రాష్ట్ర పోలీసులు కొత్త ప్రతిపాదనలు చేశారు. తొలుత వీధుల్లో ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని ఇళ్లను కవర్‌ చేసేలా చూస్తారు. అటు తరువాత ప్రజలను చైతన్యం చేసి ప్రతీ ఇంటిలో వారే సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా దశలవారీ కార్యచరణ చేపట్టనున్నారు. 

ఎల్‌హెచ్‌ఎంఎస్‌కు సీసీ కెమెరాల కొరత..
రాష్ట్రంలో పోలీసు శాఖ వినూత్నంగా చేపట్టిన లాక్డ్‌ హౌస్‌ మోనటరింగ్‌ సిస్టం(ఎల్‌హెచ్‌ఎంఎస్‌) ఒక మేరకు ఫలితాలు ఇచ్చింది. దాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేసేందుకు పోలీసు శాఖకు సీసీ కెమెరాల కొరత ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ఇంటి యజమాని కొద్ది రోజులపాటు తన ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతానికి వెళితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అలా చేస్తే పోలీసులు స్వయంగా వచ్చి ఆ ఇంట్లో 24 గంటలపాటు నిఘా ఉంచేలా సీసీ కెమెరాలతో కూడిన ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యూనిట్‌ అమర్చుతారు. తాళం వేసిన ఆ ఇంట్లోకి ఆ తరువాత ఎవరైనా వస్తే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు అలారంతో కూడిన సంకేతాలు ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ఏర్పాటు కోసం 8,12,450 విజ్ఞాపనలు రాగా 3,80,79 విజ్ఞప్తులను పోలీసులు పరిగణలోకి తీసుకున్నప్పటికీ తొలి ప్రయత్నంగా 24,473 ఇళ్లలో మాత్రమే వీటిని అమర్చారు. ఇది మంచి ఫలితాలు ఇచి్చంది.   

ప్రతి ఇంటికి సీసీ కెమెరా..డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ 
పోలీసులు గతంలో నేర స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలకోసం వెదికేవారు. ఇప్పుడు నేరస్థలంలో మొదట సీసీ కెమెరా పుటేజీ కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధాన ప్రాంతాలు, జన సంచారం ఉండే చోట సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నాం. ఇళ్లలో దొంగతనాలను అరికట్టేందుకు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను పోలీసు శాఖ వినియోగంలోకి తెచ్చింది. ప్రతీ ఇంటికి వారే సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునేల ప్రజలను చైతన్యం చేస్తాం. నేరస్తుడు సీసీ కెమెరా ఉన్న ఇంటికి వెళ్లాలంటే దొరికిపోతాం అనే భయపడే పరిస్థితి రావాలి. దీని వల్ల నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు కంటే నేరాలు జరగకుండా అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి.

మరిన్ని వార్తలు