ఏపీలో కరోనా నివారణ చర్యలు భేష్‌

11 May, 2020 04:51 IST|Sakshi
మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యురాలు డాక్టర్‌ మధుమిత దూబే

ప్రభుత్వ పనితీరును ప్రశంసించిన కేంద్ర బృందాలు 

కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటన

కర్నూలు(సెంట్రల్‌)/నరసరావుపేట: కోవిడ్‌–19 నివారణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోందని ఆదివారం కేంద్ర బృందం సభ్యులు కితాబిచ్చారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి, వైరస్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతోందని ప్రశంసించారు. కర్నూలు జిల్లాతో పాటు గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు కేంద్ర బృందం పర్యటిస్తోంది. కర్నూలు బృందంలో ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ పబ్లిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మధుమిత దూబే, ప్రొఫెసర్‌ సంజయ్‌కుమార్‌ సాధూఖాన్‌ ఉండగా, గుంటూరు బృందంలో డాక్టర్‌ బాబీపాల్, డాక్టర్‌ నందినీ భట్టాచార్య ఉన్నారు. కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ నేతృత్వంలో జిల్లా నోడల్‌ అధికారులతో సమావేశమయ్యారు. డాక్టర్‌ మధుమిత దూబే ఇంకా ఏమన్నారంటే.. 

► పాజిటివ్‌ వ్యక్తులను గుర్తించేందుకు అవసరమైతే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి.
► వైరస్‌ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, కర్నూలు జిల్లా యంత్రాంగానికి చేయూతనిచ్చేందుకు సిద్ధం.
► క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించాక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లా యంత్రాంగానికి తగిన సలహాలు, సూచనలిస్తాం. 
► ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కోవిడ్‌తో కలిసి జీవించేలా ప్రజల ఆలోచనలో మార్పు తేవాలన్నారు. 
► నరసరావుపేటలో 164 కేసులే నమోదవగా, నాలుగు వేల మందికి పైగా టెస్టులు చేయడాన్ని అభినందించారు.

మరిన్ని వార్తలు