పాకిస్తాన్‌ను సమర్థిస్తే జైలుకే

11 Aug, 2019 20:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ : జమ్మూకశ్మీర్‌ విషయంలో ఎవరైతే పాకిస్తాన్‌ను సమర్థిస్తారో వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని కేంద్ర సామాజికన్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి ,రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రామ్‌దాస్‌ అథవాలే స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన పలు విషయాలు వెల్లడించారు. తెలంగాణ విభజన తర్వాత కూడా రిపబ్లికన్‌ పార్టీ రెండు రాష్ట్రాలలో చైతన్యంగా ఉందని, మా పార్టీకి అన్ని కులాలు సమానమని తెలిపారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు ఏపీ ప్రెసిడెంట్‌గా బ్రహ్మానందరెడ్డి ఉన్నారని, ప్రజలందరికీ మాపార్టీ దగ్గరవుతోందని చెప్పారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ వచ్చిందని, ఏపీలో వైఎస్సార్‌సీపీ మంచి సంఖ్యలో సీట్లు గెలిచిందన్నారు. ఏపీ సీఎం జగన్‌ ఈబీసీ కోటాపై సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1,47,857 ఇళ్లు మంజూరు చేశామన్నారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం చాలా మంచిదని, ఇకపై కశ్మీర్‌లో తీవ్రవాదం తగ్గి పరిశ్రమలు వస్తాయని తెలిపారు. తలాక్‌ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం హర్షణీయన్నారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథీలో ఓడిపోయారు. ఇప్పుడు సోనియాగాంధీ అధ్యక్షురాలైనా ఆ పార్టీలో పెద్దగా మార్పు ఉండదన్నారు. రాబోయే 20 సంవత్సరాలు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు