సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయానికి ‘ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ’గా నామకరణం చేశారు.
అనంతపురం జిల్లా జంతులూరులో రూ. 902.07 కోట్లతో వర్సిటీ ఏర్పాటు కానుంది. పూర్తిస్థాయిలో భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో వర్సిటీని కొనసాగించాలని నిర్ణయించింది. ఈ వర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.