అదే కేంద్రం.. అదే అన్యాయంపై ‘దేశం’ పిల్లి మొగ్గలు

6 Jul, 2018 02:23 IST|Sakshi

నాలుగేళ్లు మౌనంగా ఉండి ఎన్నికల వేళ సరికొత్త డ్రామా

అఫిడవిట్‌ సాకుతో మాయ నాటకాలు

పోలవరం, రెవెన్యూ లోటు, రైల్వేజోన్, రాజధాని, కడప స్టీలు ప్లాంట్‌ వంటి అన్ని విషయాల్లోనూ మొండిచేయి  

బీజేపీకి కొమ్ముకాసి ఎన్డీఏలో కొనసాగిన చంద్రబాబు

2014 ఏప్రిల్‌కి ముందు పోలవరానికి పెట్టిన ఖర్చు ఇచ్చేది లేదని అప్పట్లోనే చెప్పిన జైట్లీ

బీజేపీతో విడిపోయాకే ఈ అంశాలన్నీ తెలిసినట్లు బాబు డ్రామాలు

2016 సెప్టెంబర్‌లో చంద్రబాబు అంగీకరించిన అంశాలనే సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ రూపంలో ఇచ్చిన కేంద్రం

ప్రజలకు జవాబు చెప్పాల్సివుందని ముందే ఎదురుదాడి

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ పాతరేస్తున్నా.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి నాలుగేళ్లు అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సాకుగా చూపి రాద్ధాంతం చేస్తుండడం..ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సరికొత్త డ్రామాకు తెరతీసినట్లయింది.  రాష్ట్రానికి ఓ వైపు అన్యాయం జరగుతుందని తెలిసినా బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన చంద్రబాబు.. ఆ పార్టీతో  తెగతెంపులు చేసుకున్నాక యూటర్న్‌ తీసుకుని హడావుడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కేంద్రం ఇప్పుడు అఫిడవిట్‌లో చెప్పిన వాటినే ఆనాడు  స్వాగతించిన టీడీపీ నాయకులు నేడు హంగామా చేస్తుండడం దొంగే.. దొంగ దొంగ అని అరిచిన చందాన్ని గుర్తుచేస్తోంది. పోలవరానికి ఇరిగేషన్‌ కాంపౌండ్‌ నిధులే ఇస్తామంటున్న కేంద్రం   పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 ఏప్రిల్‌ ఒకటో తేదీకి ముందు పెట్టిన ఖర్చును ఇచ్చేది లేదని కేంద్రం  ముందునుంచీ మొండికేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు రాద్ధాంతం చేయడం విస్మయం గొలుపుతోంది. 2016 సెప్టెంబర్‌ 8న కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రకటనలోనూ ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్‌లోని ఆంశాలే ఉన్నప్పటికీ.. అప్పుడు నోరు మెదపని చంద్రబాబు రెండేళ్ల తర్వాత ఇప్పుడు రభస మొదలు పెట్టారు.

ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇరిగేషన్‌ కాంపౌండ్‌ నిధులు మాత్రమే ఇస్తామని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. ఈ విషయాలనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్ర పర్యటనలోనూ, ఢిల్లీలోనూ పలుమార్లు స్పష్టం చేశారు. కేంద్రం చెప్పినదాని ప్రకారం ఈ ప్రభుత్వం ఏర్పడకు ముందు ఖర్చు పెట్టిన రూ.5,135.87 కోట్లు, ఇరిగేషన్‌ కాంపౌండ్‌ పరిధిలోకి రాని పవర్‌హౌస్, తాగునీటి సరఫరా ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,868 కోట్లు మొత్తం కలిపి రూ.8003.87 కోట్లు ఇచ్చేది లేదని గతంలోనే తేల్చేశారు. అయినా బీజేపీతో అంటకాగినప్పుడు ఈ విషయాలను పట్టించుకోకుండా ఇప్పుడు పోలవరానికి సహాయం చేయడం లేదని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై మాట్లాడడం లేదని గగ్గోలు పెడుతూ ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నారు.

లోటు బడ్జెట్‌పైనా డ్రామాలే..  
రెవెన్యు లోటు రూ.16 వేల కోట్లు ఇవ్వాలనే డిమాండ్‌ను కేంద్రం అంగీకరించకపోయినా చంద్రబాబు బీజేపీని నాలుగేళ్లపాటు వెనుకేసుకొచ్చారు. రైతు రుణమాఫీ, పించన్ల సొమ్మును లోటు బడ్జెట్‌లో ఎలా చేరుస్తారని, ఈ రెండూ మినహాయించగా మిగిలిన సొమ్ము ఇస్తామని చెప్పి రూ.3,900 కోట్లే విడుదల చేసినా.. దానిపై పట్టు పట్టకపోగా అప్పట్లో సమర్థించుకున్నారు.

ఇదే విషయాన్ని ఇప్పుడు కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంటే దీన్ని ఇప్పుడే కనుగొన్నట్లు డ్రామాలు మొదలుపెట్టారు. రుణమాఫీ, పింఛన్‌ సొమ్మును కేంద్రం లోటు బడ్జెట్‌ కింద పరిగణించడంలేదని, దీనిపై చేసేదేమీ లేదని చంద్రబాబే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పారు. అధికారం కోసం బీజేపీతో రాజీపడి ఇప్పుడు దాని గురించి కొత్తగా మాట్లాడడం రాజకీయం కాక మరేమిటనే ప్రశ్నలకు టీడీపీ నాయకులు దబాయింపే సమాధానంగా ఎంచుకున్నారు.  

రైల్వే జోన్‌పై ఎనాడైనా మాట్లాడారా?
విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో రైల్వే జోన్‌ ఏర్పాటు అంశం ప్రధానంగా ఉన్నా.. దాని గురించి నాలుగేళ్లపాటు కేంద్రాన్ని టీడీపీ నిలదీసిన పాపానపోలేదు. రైల్వే జోన్‌ ఏర్పాటుపై కేంద్రం తొలి నుంచి అనుమానాస్పదంగానే మాట్లాడుతున్నా పట్టించుకోకపోగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేసింది.

  బీజేపీతో కలిసి త్వరలో జోన్‌ వచ్చేస్తుందని, దీనిపై ప్రకటన వెలువడుతుందనే లీకులను అనుకూల మీడియా ద్వారా ఇచ్చారు. అదే అంశంపై  విపక్షాలు ఆందోళన చేసినపుడు కలిసిరాని టీడీపీ ఇప్పుడు దీక్షల పేరుతో హడావుడి చేయడాన్ని బట్టి   వారి చిత్తశుద్ధి స్పష్టమవుతోంది.  

రాజధాని నిధుల విషయంలోనూ అదే ధోరణి..
రాజధాని నిర్మాణానికి నిధులిచ్చే అంశంపై కేంద్రం తొలి నుంచి కొర్రీలు వేస్తున్నా.. నాలుగేళ్లపాటు చంద్రబాబు మారుమాట్లాడకుండా ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం హంగామా సృష్టిస్తున్నారు. రాజధాని డీపీఆర్‌ ఇవ్వలేదని కేంద్ర అధికారులు అనేకసార్లు చెప్పగా అప్పట్లో దానిపై రాష్ట్ర ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వకుండా అన్నీ ఇచ్చామని సమర్థించుకుంది.

ఇచ్చిన రూ.2,500 కోట్లకు లెక్కలు చెప్పలేదని కేంద్రం ప్రకటించగా, లెక్కలన్నీ ఇచ్చేశామని చెప్పి ప్రజలను గందరగోళానికి గురిచేసింది. రాజధానిలో ముఖ్యమైన నిర్మాణాలకు నిధులిస్తాంగానీ రాష్ట్ర ప్రభుత్వం చూపే గాలిమేడలకు నిధులు ఎలా ఇస్తారనే ప్రశ్నలు కేంద్రం నుంచి చాలాసార్లు వచ్చినా బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఈ అంశాలను పట్టించుకోలేదు.

నాలుగేళ్లుగా రాజధానికి నిధులివ్వకపోయినా కేంద్రంతో కలిసి పనిచేసిన చంద్రబాబు గొప్పలకు పోయి ప్రధాని తనను రష్యాలోని ఆస్తానా నగరాన్ని చూడాలని చెప్పారని, అక్కడికెళ్లి తనకు ఫోన్‌ చేసి అలా రాజధాని కట్టాలని చెప్పారని చెప్పుకున్నారు. రూ.2,500 కోట్ల నిధుల్లో వెయ్యి కోట్లు విజయవాడ, గుంటూరు నగరాలకు ఇచ్చినవనే విషయం గురించి మొన్నటివరకూ మాట్లాడకుండా, బీజేపీతో విడిపోయాక వాటి గురించి చెప్పడం, రాజధానికి కేంద్రం సహకరించడంలేదని ఆరోపించడం వెనుక రాజకీయ కారణాలు తప్ప వేరే ఏమీ లేదని తేటతెల్లమవుతోంది.  

వెనుకబడిన జిల్లాలకిచ్చే నిధులపైనా అంతే!
వెనుకబడిన జిల్లాలకిచ్చే నిధులపై కేంద్రంపై పెద్దగా ఒత్తిడి తేకుండా ఇచ్చిన వాటితోనే రాష్ట్ర ప్రభుత్వం మొన్నటివరకూ సరిపెట్టుకుంది. మూడు సంవత్సరాలకు సంబంధించి రూ.1,050 కోట్లు కేంద్రం ఇవ్వగా వాటికి సరైన లెక్కలు చెప్పలేదనే కారణంతో మిగిలిన సంవత్సరాల నిధులను కేంద్రం నిలిపివేసింది.

ఈ నిధులను దేనికి, ఎంత ఖర్చు పెట్టారనే విషయాలను గోప్యం ఉంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ విషయాన్ని దాచిపెట్టి ఇప్పుడు నిధులు ఇవ్వడంలేదనే విషయాన్ని ఎత్తిచూపుతూ గొడవ మొదలు పెట్టింది. దుగరాజపట్నం పోర్టుకు ఇస్రో అభ్యంతరం చెబుతోందని ప్రత్యామ్నాయంగా మరోచోటును చూపించాలని కేంద్రం రెండేళ్ల క్రితమే చెప్పినా.. దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఇప్పుడు పోర్టుపైనా అన్యాయం చేస్తున్నారనే పల్లవి అందుకుంది.  

కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీపై సరికొత్త డ్రామా..  
కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం తాజాగా ఇటీవలే దాన్ని తెరపైకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు నాలుగేళ్లు దాని గురించి మాట్లాడకుండా ఇప్పుడు దానిపై తన పార్టీ నేతలతో దీక్షలు చేయించి చంద్రబాబు సరికొత్త డ్రామా నడిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నా అభ్యంతరం చెప్పకపోగా అందులో కీలకపాత్ర పోషించారు.

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడంతోనే ప్రత్యేక హోదాకు కేంద్రం పాతరేసిందని గగ్గోలు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం అసలు ప్రత్యేక హోదాయే వద్దని, దాని స్థానంలో ప్యాకేజీయే మేలని అంగీకరించి, అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని చేసిన విషయాన్ని మరచిపోతోంది. బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని మోసం చేసి ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయనగా రాజకీయ లబ్ధికోసం తాను చేసిన మోసాన్ని తానే ప్రశ్నిస్తూ ప్రజలను వంచించేందుకు చంద్రబాబు రకరకాల డ్రామాలాడుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అనుకూల మీడియా ద్వారా గతంలో జరిగిన అంశాలు తెరపైకి రాకుండా కేంద్రం చేసిన అన్యాయం ఇప్పుడే తెలిసినట్లు నటిస్తూ డ్రామాను రోజురోజుకూ రక్తికట్టిస్తున్నారు.

మరిన్ని వార్తలు