సర్టిఫికెట్లు లేకున్నా కౌన్సెలింగ్‌కు అనుమతి

10 Sep, 2014 00:15 IST|Sakshi
సర్టిఫికెట్లు లేకున్నా కౌన్సెలింగ్‌కు అనుమతి

వెరిఫికేషన్ కేంద్రాలకు మౌఖిక ఆదేశాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్
విద్యార్థులకు ఊరట
‘సాక్షి’ కథనానికి స్పందన

 
 హైదరాబాద్ : పీజీ ఈసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకున్నా వెరిఫికేషన్‌కు హాజరుకావచ్చు. అయితే.. బీటెక్‌లో అన్ని సబ్జెక్టులు పాసైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని వెరిఫికేషన్ కేంద్రంలో సమర్పించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందని కారణంగా పలు ఇంజనీరింగ్ కాలేజ్‌లు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని కారణంగా గేట్, పీజీ ఈసెట్ ర్యాంకర్లు ఈనెల 6నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్‌కు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై ఈనెల 7న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బీటెక్ పాసైనట్లు ధ్రువీకరణ పత్రం తెచ్చిన అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కౌన్సెలింగ్ కేంద్రాలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.

 పాసైనట్లు ధ్రువీకరణ ఇలా..

పీజీ ఈసెట్ వెరిఫికేషన్ కేంద్రాలకు వె ళ్లే అభ్యర్థులు విద్యార్హతల పత్రాలు కళాశాల్లోనే ఉన్నట్లైతే.. తమ వద్దే ఉన్నట్లుగా ప్రిన్సిపాల్ ఇచ్చే కస్టోడియన్ లెటర్‌ను వెరిఫికేషన్ అధికారులకు చూపవచ్చు. అదే లెటర్లో బీటెక్ అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులైనట్లుగా పేర్కొనాలి. లేదా పాస్ సర్టిఫికెట్ల జిరాక్సుప్రతులపై అటెస్టేషన్ చేసి ఇచ్చినా అనుమతిస్తారు. అలా కుదరని పక్షంలో..  సంబంధిత యూనివర్సిటీల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌ల నుంచి సదరు విద్యార్థి బీటెక్ ఉత్తీర్ణులైనట్లు ధ్రువపత్రం (కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో జిరాక్సు ప్రతిని అటెస్టేషన్ చేయించి) తెచ్చినా సరిపోతుంది. ఆర్జేయూకేటీ పరిధిలోని బీటెక్ పాసైన వారికి కూడా ఈ తరహా లెటర్లు ఇవ్వాలని ఆయా సంస్థల డెరైక్టర్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి.

 లెటర్లు తెచ్చినా చాలు: పీజీ ఈసెట్ కన్వీనర్

 బీటెక్ పాసైన అభ్యర్థులకు సీఎంఎం జిరాక్సు ప్రతులపై అటెస్టేషన్ చేసి ఇవ్వాలని అన్ని యూనివర్సిటీల కంట్రోలర్లకు సూచించాం. కళాశాలల్లో ప్రిన్సిపాల్  నుంచి కస్టోడియన్ లెటరు తెచ్చినా అనుమతిస్తున్నాం.       

మరిన్ని వార్తలు