వికటించిన సిజేరియన్‌!

10 Jun, 2019 13:32 IST|Sakshi
సిజేరియన్‌ వికటించి ఇబ్బంది పడుతున్న బాధితురాలు నాగతిరుపతమ్మ

మూడోసారి కుట్లు వేసినా నయం కాని వైనం

ఆందోళనలో బాధితులు

మచిలీపట్నం టౌన్‌ : జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గర్భిణికి చేసిన సిజేరియన్‌ మరోసారి వికటించింది. ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో ప్రసవం కోసం వచ్చిన పేద గర్భిణులకు తరచూ సిజేరియన్‌ సమయంలో ఇబ్బందులు తప్పటం లేదు. ఆస్పత్రిలోని ఓ వైద్యురాలు నిర్లక్ష్యంగా సిజేరియన్‌ చేయటంతో ఆ గర్భిణికి రక్తస్రావం ఆగని పరిస్థితి నెలకొంది. దీంతో సిజేరియన్‌ చేసిన గంటలోనే మరోసారి కుట్లు వేశారు. కొద్ది రోజుల తర్వాత కుట్లు చీము పట్టి మానకపోవటంతో మరోసారి మూడు కుట్లు వేశారని బాధితులు చెబుతున్నారు. ఇలా మూడుసార్లు కుట్లు వేసినా బాధితురాలికి న యం కాలేదు. దీంతో ఆదివారం బాధితురాలి బంధువులు ఆస్పత్రిలో ఆందోళన వ్యక్తం చేశారు.

వైద్యం అందించిన డాక్టర్‌ సెలవులో ఉం డటంతో ఆమె ఇంటి అడ్రస్, సెల్‌ఫోన్‌ నెంబరు ఇవ్వమని ప్రాధేయపడినా ఎవ్వ రూ ఇవ్వలేదు. వివరాలిలా ఉన్నాయి. ఘంట సాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన నాగతిరుపతమ్మ అనే గర్భిణిని వారి కుటుంబ సభ్యులు కాన్పు కోసం 17 రోజుల క్రితం ఆస్పత్రికి తీసకువచ్చారు. రెండో రోజు వైద్యురాలు సిజేరియన్‌ చేశారు. సిజేరియన్‌ చేసి వార్డులోని మంచం మీద పడుకోబెట్టిన కొద్ది సేపటికే గాయం నుంచి రక్తస్రావం ఆగకపోవటంతో మంచంపై ఉన్న దుప్పటి మొత్తం రక్తంతో తడిచిపోయింది. దీంతో కంగారు పడిన నాగతిరుపతమ్మ బంధువులు వైద్య సిబ్బందికి విషయాన్ని చెప్పారు. దీంతో సిజేరియన్‌ చేసిన గంటకు బాధితురాలిని మరోసారి ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకువెళ్లి కుట్లు వేశారు. రక్తస్రావం ఆగినా కుట్లు మానలేదు. చీము పట్టి ఇబ్బం దిగా ఉండటంతో మళ్లీ తీసుకువెళ్లి మూడు కుట్లు వేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ కుట్లు కూడా ప్రస్తుతం మానకపోవటంతో సిజేరియన్‌ నిర్లక్ష్యంగా చేయబట్టే నాగతిరుపతమ్మకు సమస్య ఏర్పడుతోందని ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం ఆందో ళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆర్‌ఎంవో అల్లాడ శ్రీనివాసరావును వివరణ కోరగా కొంత మంది శరీరతత్వం ప్రకారం పై కుట్లు మానటంలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఇలాం టి కేసులు అప్పుడప్పుడు చోటు చేసుకుంటా యని చెప్పారు. లోపలి కుట్లు బాగానే ఉన్నాయని, పై కుట్లు కూడా త్వరలోనే మానతాయన్నారు. ఆం దోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 

మరిన్ని వార్తలు