గొట్టిపాటికి చంద్రబాబు షాక్!

23 May, 2017 19:04 IST|Sakshi
గొట్టిపాటికి చంద్రబాబు షాక్!

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు షాకిచ్చారు. మంగళవారం ఉదయం ఒంగోలులో తనకు కరణం బలరాంతో జరిగిన ఘర్షణ విషయమై ఫిర్యాదు చేసేందుకు ఆయన ముఖ్యమంత్రిని నేరుగా కలుస్తానని ఉదయమే చెప్పిన విషయం తెలిసిందే. అందుకోసం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి ఇప్పుడు బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆయనకు చెప్పారు. దాంతో ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఎప్పుడు దొరుకుతుందా అని గొట్టిపాటి రవికుమార్ ఎదురు చూస్తున్నారు. ఈరోజు కాకపోయినా రేపయినా చంద్రబాబును కలవాలని ఆయన భావిస్తున్నారు. బుధవారం నాడు తెలంగాణలో జరిగే టీడీపీ మహానాడుకు చంద్రబాబు హాజరు కానున్నారు. దాంతో అక్కడికైనా వెళ్లి కలవాలని గొట్టిపాటి అనుకుంటున్నారు.

మంగళవారం ఉదయం జరిగిన ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఒకరినొకరు తోసుకోవడంతో పాటు చొక్కాలు కూడా చించుకున్నారు. ఈ గొడవలో గొట్టిపాటి రవికుమార్ కింద పడిపోయారు.  పోలీసులు జోక్యం చేసుకుని వారిద్దరినీ విడదీశారు. బందోబస్తు మధ్య ఆయనను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు