ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు:చంద్రబాబు

30 Jun, 2015 18:01 IST|Sakshi
ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు:చంద్రబాబు

హైదరాబాద్: 'ఫ్రీ ఫుడ్...ఫ్రీ డ్రింక్... ఫ్రీ హాలిడేస్...' అంటూ సైనికులపై అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సైనికులపై ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా ముందు పద్ధతిగా మాట్లాడాలని పదేపదే చెబుతున్నా.. ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేసే ఇటువంటి వారితోనే పార్టీకి లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయని మండిపడ్డారు.

 

ఈ వ్యవహారంపై సదరు ఎంపీ నుంచి 24 గంటలలోగా రాతపూర్వకంగా సంజాయిషీ తీసుకోవాలని పార్టీ నేతలను మంగళవారం ఆదేశించారు.  ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా దేశాన్ని కాపాడుతున్న సైనికులపై ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నుంచి నేటి వరకూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని గౌరవం ఉందని గుర్తచేశారు. ఎంపీ మాటల్ని పార్టీ అభిప్రాయాలుగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.

మరిన్ని వార్తలు