ఐదు లక్షల కోట్లని ఆ వేళ ఎందుకన్నావ్?:కె.నారాయణ

5 Oct, 2013 10:35 IST|Sakshi
ఐదు లక్షల కోట్లని ఆ వేళ ఎందుకన్నావ్?:కె.నారాయణ

 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసానికి రాజకీయపార్టీల నీతిమాలినతనమే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటన చేశాక రూ.ఐదు లక్షల కోట్ల తో అద్దాల మేడలు కడతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడెందుకు సమన్యాయమంటున్నారో చెప్పాలని నిలదీశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డితో కలిసి ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడున్న వ్యక్తే(సీఎం) వ్యతిరేకిస్తుంటే శాంతిభద్రతల్ని, ప్రజల అనుమానాల్ని ఎవరు నివృత్తి చేస్తారని మండిపడ్డారు.
 
  ‘‘బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రే రెచ్చగొడుతుంటే, అబద్ధపు ప్రచారం చేస్తుంటే జనం మరింత చెలరేగిపోరా? అసెంబ్లీలో ఓటింగ్ ఉండదని తెలిసీ సీఎం అబద్ధాలు చెప్పడం అగ్నికి ఆజ్యం పోయడం కాదా? రాష్ట్ర విధ్వంసానికి సీఎం, కాంగ్రెస్‌వారే కారణం. మరోపక్క చంద్రబాబూ నాశనం చేస్తున్నారు.. బుర్రోన్నుళ్లు చేసే పనేనా ఇది? తెలంగాణకు అనుకూలమని ఉత్తరం ఇచ్చారా? లేదా? ఇప్పుడు సమన్యాయమనే డాన్స్ ఏమిటీ? వైఎస్సార్‌సీపీ కూడా ఇలాగే అని ఇప్పుడు సమైక్యాంధ్ర నిర్ణయం తీసుకుంది. సీమాంధ్రలో ఆధిపత్యానికి పోటీపడి మరీ పార్టీలు జనాన్ని రెచ్చగొడుతూ పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. ఇది ఘోరకృత్యం’’ అని మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు