సాక్షి, చిత్తూరు : కుప్పంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ సీఎం చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. రాజకీయాల్లో ఏ పార్టీకి ఓటు వేయాలి, ఏ పార్టీలో ఉండాలి అనేది వ్యక్తిగత స్వేచ్ఛ. దానిని కాదనడానికి, బెదిరింపులకు పాల్పడే అధికారం ఎవరికీ లేదు. అయితే ఏకంగా ఓ సీఎం స్థాయి వ్యక్తి అయ్యి ఉండి కూడా దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు.
చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ జగన్కు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు నాయుడు బెంబేలెత్తిపోయారు. ఈ ప్రభావం కుప్పంలో ఎక్కడ పడుతుందేమోనని తన మార్కు రాజకీయాలకు చంద్రబాబు తెరలేపారు. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార షెడ్యుల్ తెలుసుకుని టీడీపీ కార్యకర్తకు ఆదేశాలిస్తున్న ఓ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ రోజు జగన్ 9:30 కి వస్తున్నారు సర్.. కుప్పానికి అంటూ టీడీపీ కార్యకర్త చెప్పగా, 'అసలు మీటింగ్కే పోకూడదు. కాదని ఎవరైనా వెళితే వారి పేర్లను నోట్ చేసుకోండి. భవిష్యత్లో మనకో ఐడియా ఉంటుంది. మనం ఏమి చేయాలన్నది ఇప్పుడు మాట్లాడక్కర్లేదు. మనం మళ్లీ వారిని చూసుకుంటాం. వాళ్లకు ఏ బెనిఫిట్ ఇవ్వకుండా. నార్మల్గా వచ్చేవి ఏమీ ఇవ్వకుంటే సరిపోతుంది' అంటూ టీడీపీ కార్యకర్తకు బ్రీఫ్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడి బెదిరింపులను లెక్కచేయకుండా, వైఎస్ జగన్ సభను కుప్పం ప్రజలు విజయవంతం చేశారు.