సీఎం రమేష్‌ చెప్పినట్టు వినాలి 

4 Feb, 2019 03:05 IST|Sakshi

తెలుగుగంగ లైనింగ్‌ పనుల టెండర్లపై అధికారులకు సీఎం చంద్రబాబు అల్టిమేటం 

ఆ పనులకు గత జూలై 16న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన సర్కార్‌ 

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో షెడూళ్లు దాఖలు చేసిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ 

అక్రమాలను ‘సాక్షి’ ఎత్తిచూపడంతో టెండర్‌ను రద్దు చేసిన సీవోటీ 

సీఎం రమేష్‌ సంస్థకే పనులు అప్పగించాలని సీఎం ఆదేశం 

సాక్షి, అమరావతి: తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన ప్రభుత్వ పెద్ద.. తప్పు చేసిన వారికే పనులు అప్పగించాలని అధికారులపై తీవ్ర స్థాయిలోఒత్తిడి తెచ్చారు. ఈ వ్యవహారానికి తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్‌ పనుల టెండర్‌ వేదికైంది. వివరాల్లోకి వెళితే.. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ. 4,460.64 కోట్లుగా ఖరారు చేస్తూ మార్చి 20, 2007న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో 2009 నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉండగా అంచనా వ్యయాన్ని రూ. 6,671.62 కోట్లకు పెంచేస్తూ 2018 మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించింది. అడ్డగోలుగా పెంచేసిన అంచనా వ్యయంతో.. మిగిలిన పనులను బినామీ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి కమీషన్‌లు వసూలు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదిలోనే స్కెచ్‌ వేశారు.

తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ నుంచి 18.20 కి.మీ వరకు లైనింగ్‌ చేయడం, 18.200 కి.మీ నుంచి 42.566 కిమీ వరకు గతంలో లైనింగ్‌ చేయకుండా మిగిలిపోయిన పనులు, బనకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ (బీసీఆర్‌) నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే లింక్‌ ఛానల్‌ 0.00 కి.మీ నుంచి 7.380 కి.మీ వరకు లైనింగ్‌ చేయకుండా మిగిలిపోయిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. 2007 నాటి ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు. కానీ.. మార్చి 9, 2018న జారీ చేసిన ఉత్తరులలో ఈ పనుల విలువను రూ. 180.48 కోట్లుగా ఖరారు చేశారు. ఆ పనుల వ్యయాన్ని మళ్లీ పెంచాలని ముఖ్యనేత ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన అధికారులు ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ. 280.27 కోట్లకు పెంచేస్తూ జూన్‌ 8, 2018న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులకు రూ. 239.03 కోట్లను అంతర్గత విలువగా నిర్ణయించిన అధికారులు.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థకు ఆ పనులు దక్కేలా నిబంధనలతో జూలై 16న ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. 18 నెలల్లో ఈ పనులకు పూర్తి గడువు విధించారు. జూలై 31న టెక్నికల్‌ బిడ్‌ను తెరిచారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ సంస్థతో పాటు ష్యూ, హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రాలు బిడ్‌లు దాఖలు చేశాయి. 

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో.. 
పనులు చేసిన అనుభవం లేకున్నా ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను చూపి.. అధికార బలంతో పనులు దక్కించుకోవడంలో రిత్విక్‌ది అందెవేసిన చేయిగా జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. తెలుగు గంగ లైనింగ్‌ పనుల టెండర్‌లో టెక్నికల్‌ బిడ్‌ను తెరిచిన సమయంలో రిత్విక్‌ సంస్థ తప్పుడు అర్హత పత్రాలు సమర్పించినట్లు ష్యూ సంస్థ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపూర్, అలహాబాద్‌ జిల్లాల పరిధిలో బన్సాగర్‌ కెనాల్‌ ప్రాజెక్టు పనులను రిత్విక్‌ సంస్థ సబ్‌ కాంట్రాక్టర్లతో చేయించిందని.. కానీ ఆ పనులు తానే చేసినట్లు తప్పుడు పత్రాలు సమర్పించిందని, ఈ నేపథ్యంలో ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని కోరారు. కానీ, ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆగస్టు 6న ప్రైస్‌ బిడ్‌ తెరిచారు. 2.88% అధిక ధర (ఎక్సెస్‌)కు రిత్విక్‌ (ఎల్‌–1), 3.61% ఎక్సెస్‌కు ష్యూ (ఎల్‌–2), 4.31 శాతం ఎక్సెస్‌కు హెచ్‌ఈఎస్‌ (ఎల్‌–3) సంస్థలు బిడ్‌లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఎల్‌–1గా నిలిచిన రిత్విక్‌ సంస్థకు పనులు అప్పగించాలని సీవోటీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ అక్రమ వ్యవహారాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేసింది. టెండర్‌ను ఖరారు చేసి సీఎం రమేష్‌కు అప్పగించాలని నవంబర్‌ 30న సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ అంశాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. దాంతో సీవోటీ అధికారులు టెండర్‌ను రద్దు చేశారు.  

అయినా తీరు మారలేదు.. 
తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్‌ పనులకు రూ. 239.03 కోట్ల అంచనా వ్యయంతో జనవరి 14న రెండోసారి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. సీఎం రమేష్‌ సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు పెట్టారు. ఇతర సంస్థలు టెండర్‌లో షెడ్యూళ్లు దాఖలు చేయకుండా ఇప్పటికే తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఈ క్రమంలో సీఎం రమేష్‌ చెప్పినట్టు విని.. పనులు ఆయనకు చెందిన సంస్థకే అప్పగించాలని జలవనరుల శాఖ అధికారులు, తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈనెల 11లోగా షెడ్యూల్‌ దాఖలు చేసుకోవచ్చు. 12న టెక్నికల్‌ బిడ్‌.. 16న ఫైనాన్స్‌ బిడ్‌ ఖరారు చేసి సుమారు 4.85 శాతం అధిక ధర (ఎక్సెస్‌)కు సీఎం రమేష్‌ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్‌ను ఆమోదించి.. పనులు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు.   

మరిన్ని వార్తలు