విజయవాడ : ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలో బుధవారం ఉదయం విజయవాడలో ‘ర్యాలీ ఫర్ రివర్స్’ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పాల్గొన్నారు. నదులను పరిరక్షించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే 16 రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో ఈషా ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకుంది.
కార్యక్రమంలో పాల్గొన్న జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ ర్యాలీ ఫర్ రివర్స్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. నదులు అంతరించిపోతే విపత్తులు సంభవిస్తాయని హెచ్చరించారు. 25 ఏళ్లుగా దేశవ్యాప్తంగా నదులు స్వరూపం కోల్పోతున్నాయని.. నదులు శుష్కించిపోవడానికి కారణం మనమేనని పేర్కొన్నారు. నదుల పరిరక్షణకు అందరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు.